కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఆగిపోయిన రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగింది. కరోనాను సైతం పక్కపెట్టి తమతమ స్థానాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ..ప్రతి వ్యూహాలను రచిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఈ రాజకీయ వేడి పెరిగింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, బేరసారాలు జరిగిపోతున్నాయి. బేరం కుదిరిన ఎమ్మెల్యేలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. అయితే పరిస్థుతులన్ని అధికార బిజెపి అనుకూలంగానే ఉన్నాయి. గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో నాలుగు స్థానాల్లో మూడు బిజెపి, ఒక కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామా చేకుండా ఉంటే బిజెపి, కాంగ్రెస్ చెరో రెండు స్థానాలను గెలుచుకునేవి. కాని రాజీనామాలతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలింది.
మరోవైపు కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. దీంతో బిజెపి (117) సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఇక 68 మంది సభ్యులున్న ప్రతిపక్ష కాంగ్రెస్కు ఓ స్థానం దక్కనుంది. దీనికోసం ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
ఇక నాలుగో స్థానంపై ఇరు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న జెడిఎస్ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీకి అసెంబ్లీలో 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఓ స్థానం గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. జెడిఎస్ నాలుగో స్థానం గెలుచుకోవాలంటే కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా మద్దతు అవసరం.
ఈ క్రమంలో కాంగ్రెస్-జేడిఎస్ జట్టు కట్టి మాజీ ప్రధాని, జేడిఎస్ అధినేత దేవెగౌడను బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవెగౌడ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపేలా కుమార స్వామి ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు కన్నడ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తే బిజెపి రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకున్నా, కాంగ్రెస్, జెడిఎస్ చెరో స్థానం గెలుపొందొచ్చు.
అయితే వృద్ధాప్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని దేవెగౌడ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల వేళ సభ్యులు జారిపోకుండా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్త పడుతున్నాయి.
బిజెపిలో టిక్కెట్ల కోసం నేతలు ప్రయత్నాలు
ఇక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో టికెట్ కోసం ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. నాలుగింటిలో రెండు స్థానాలు కైవసం చేసుకోగలిగే బలం ఉన్న బిజెపిలో ఈ పోటీ అధికంగా ఉంది. ఒకవైపు మాజీ మంత్రి ఉమేశ్ కత్తి తన తమ్ముడు రమేశ్ కత్తికి టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పతో ఉమేశ్ కత్తి సమావేశమై టికెట్ కోసం విన్నవించారు.
మరోవైపు మంత్రి రమేశ్ జార్కిహొళి రాత్రి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. మొత్తానికి రాజకీయ రంగస్థలానికి వేదికగా నిలిచే కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఎన్నికలు ముగిసేలోపు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. అధికార బిజెపిలో పోటీకి సీనియర్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.