iDreamPost

NTR భార్యగా అది నా హక్కు.. రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి లేఖ

NTR భార్యగా అది నా హక్కు.. రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా  ఈనెల 28న ఆయన పేరుతో రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, నారా కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందాయి. కానీ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్ సీపీ నేత, ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి.. రాష్ట్రపతికి లేఖ రాశారు.

రాష్ట్రపతికి రాసిన లేఖలో లక్ష్మీ పార్వతి కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని  లక్ష్మీ పార్వతి లేఖ ద్వారా కోరారు. భార్యగా తానే అసలైన వారుసురాలినని లేఖలో ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారని, ఆయన మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలిచి..తనను పిలవక పోవడంపై లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెకు మద్దతుగా కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో తోడునీడగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ మాత్రమేనని, అలాంటి ఆమెను పిలవకపోవడం చాలా దారుణమన్నారు. ఎన్టీఆర్ ను వృద్ధాప్యంలో పదవీచ్యుతుడిని చేసి.. మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్త సంబంధీకులను, అల్లుళ్లను ఆహ్వానించిందని కేంద్రం దుమ్మెత్తి పోస్తున్నారు. అలానే ఎన్టీఆర్ ను ఎవరైతే మానసికంగా హింసించారో వాళ్లందరిని ఆహ్వానించడం అంటే.. ఆయన ఆత్మ క్షోభించేలా చేయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే లక్ష్మీ పార్వతి కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాశారు. మరి.. లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి