iDreamPost

ప్రజల ప్రాణ భయమే ఆయా కంపెనీలకు ఆదాయ వనరు

ప్రజల ప్రాణ భయమే ఆయా కంపెనీలకు ఆదాయ వనరు

ఒకరి బలహీనత ఇంకొకరికి పెట్టుబడి.. ఇప్పటివరకు ఎయిడ్స్ లాంటి కొన్ని వ్యాధులకు ఇంకా మందు కనిపెట్టబడలేదు. వాటిని కూడా నయం చేస్తాం అంటూ కొందరు ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ప్రజల బలహీనతే వారికి బలం..ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా ఇప్పుడు ఫార్మా కంపెనీలకు బంగారు బతులా దొరికింది. ప్రాణాలు కాపాడటం పక్కన పెడితే ఎంత త్వరగా కరోనాకు మందు తయారు చేస్తే అంత ఎక్కువ ఆదాయం ఉంటుంది అన్నమాట కంపెనీలకు తెలుసు.

అందుకే పూర్తిస్థాయిలో మందు కనిపెట్టకపోయినా కనిపెట్టాం అని ప్రచారం చేసుకునే కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఒక్క ప్రకటన ఇస్తే చాలు ఆరోజు కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్ లో ఎక్కడికో దూసుకుపోతాయి. నిజానికి కరోనా పేషేంట్స్ పదిరోజుల్లోనే ఆస్పత్రిలో ఇచ్చే పారాసిట్మాల్ ,అజిత్రోమైసిన్, హైడ్రోక్లోరోక్విన్ , బీకాంప్లెక్స్ లతో పూర్తిగా కోలుకొని ఇళ్లకి వెళ్లారు. కానీ ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే సీరియస్ కండిషన్ ఉన్న పేషేంట్స్ మాత్రం వ్యాధి నుండి కోలుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి మందు ఇంకా కనిపెట్టలేదు. కానీ మీడియాలో మాత్రం ఫలానా కంపెనీ కరోనాకి మందు కనిపెట్టిందని వార్తలు రాస్తున్నాయ్. అవన్నీ వైరల్ లోడ్ ని తగ్గించడానికి పనిచేసే మందులు తప్ప పూర్తిగా కరోనాని తగ్గించే మందులు కాదు. కరోనాను పూర్తిగా నయం చేసే అందుబాటులోకి రావడానికి టైమ్ పడుతుంది. ఇంకా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కానీ ఈ మధ్యలో వైరల్ లోడ్ ని తగ్గించే మందులను కరోనాను తగ్గించే మందులుగా ప్రమోట్ చేసుకుంటూ ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నాయి పలు ఫార్మా కంపెనీలు. ఇప్పటికే ఫ్యాబిఫ్లూ, కోవిఫిర్ లాంటి మందులు అందుబాటులో ఉన్నా అవి పూర్తిగా వ్యాధిని నయం చేయవు.. పూర్తిగా క్షీణించిన రోగిని కాపాడుతాయన్న గ్యారెంటీ లేదు.  పారాసిట్మాల్ ,అజిత్రోమైసిన్, హైడ్రోక్లోరోక్విన్, బీకాంప్లెక్స్ చేసే పని పనికోసం అంతంత ఖర్చు పెట్టి వైరల్ లోడ్ తగ్గించే టాబ్లెట్స్ కొనాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ తలెత్తే ప్రశ్న..

ఇవన్నీ పక్కన పెడితే పతంజలి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ తగ్గించే మందును కనిపెట్టామని ప్రచారం చేసుకున్న రాందేవ్ బాబాకు ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది.పతంజలి కనిపెట్టిన కొరోనిల్‌, స్వసరి’ మందును శాస్త్రీయంగా పరిశీలించి ఆమోదించేవరకు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కాగా 7 రోజుల్లో కరోనా వైరస్ ను తగ్గిస్తుంది అంటూ పతంజలి సంస్థ ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. అసలీ ముందుకు పర్మిషన్ ఎలా వచ్చిందని ఆరా తీస్తే రోగ నిరోధకశక్తి పెంపొందడానికి, దగ్గు, జ్వరం నియంత్రణ కోసం పతంజలి కనిపెట్టిన మందును పర్మిషన్ పొందిందని వెలుగులోకి వచ్చింది. అంటే కరోనా పేరు ప్రస్తావించకుండానే అమ్మకాల కోసం పర్మిషన్ పొంది కరోనాకు మందు కనిపెట్టామని ప్రచారం చేసుకుంటూ కరోనా భయాన్ని క్యాష్ చేసుకోవడానికి మార్కెట్లోకి కొరోనిల్‌, స్వసరిని తీసుకొచ్చింది పతంజలి సంస్థ..

ఇలా ప్రజల భయాన్ని క్యాష్ చేసుకునే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది.. కరోనాకి ఇంకా మందు కనిపెట్టబడలేదు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజల భయాన్ని క్యాష్ చేసుకోవడానికి వైరల్ లోడ్ తగ్గించే మందులను మార్కెట్లోకి దించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి పలు కంపెనీలు. ఇలాంటి వాటిపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకూ కంపెనీలు గుప్పించే ప్రకటనలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భయంతో కూడిన నమ్మకమే పలు కంపెనీలకు పెట్టుబడి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి