iDreamPost

PrajaPalana Applications: ప్రజాపాలన దరఖాస్తుపై సైబర్ మోసం! OTP చెప్పమని దోచేశారు!

తెలంగాణలో ప్రజా పాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా కొత్త సైబర్ నేరాలకు తెర తీశారు. వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

తెలంగాణలో ప్రజా పాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా కొత్త సైబర్ నేరాలకు తెర తీశారు. వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

PrajaPalana Applications: ప్రజాపాలన దరఖాస్తుపై సైబర్ మోసం! OTP చెప్పమని దోచేశారు!

డబ్బు సంపాదించడం చాలా కష్టం. కొందరు వంద రూపాయలు సంపాదించడం కోసం ఒకరోజు మొత్తం కూడా కష్టపడుతూ ఉంటారు. తిన్నా తినకున్నా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల భవిష్యత్ కోసం దాచుకుంటూ ఉంటారు. కానీ, కొందరు సైబర్ నేరగాళ్లు అలాంటి వాళ్ల కష్టాన్ని నిమిషాల్లో దోచేస్తున్నారు. అమాయకులు, అవగాహనలేని వాళ్లనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వాలు, పోలీసులు చేస్తున్న అవగాహన వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. అందుకే సైబర్ నేరగాళ్లు కూడా వాళ్ల పంథాని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులే టార్గెట్ గా కొత్త మోసాలకు తెరలేపారు. తాజాగా ఓ మహిళను మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలిందని, మీరు లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారని, మీకు బంగారం- గోల్డ్ కాయిన్స్ వచ్చాయంటూ చెబుతూ దరఖాస్తు కోసం ఓటీపీ చెప్పాలంటూ మోసాలకు పాల్పడేవాళ్లు. తర్వాత ఆ మోసాలను ప్రజలు గ్రహించారు. అందుకే మోసగాళ్లు కూడా పంథా మార్చారు. మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేసుకోవాలని, అకౌంట్ వివరాలు అప్ డేట్ చేసుకోండి అంటూ మోసాలు చేశారు. ఉద్యోగాల పేరిట, వర్క్ ఫ్రమ్ పేరిట ఎన్నో మోసాలు చేశారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా రూటు మార్చారు. ఏ విషయాన్ని అయితే ప్రజలు త్వరగా నమ్ముతారో వాటినే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు వారికి ఇప్పుడు ప్రజా పాలన దరఖాస్తులు మంచి అవకాశంగా మారాయి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాల కోసం దరఖాస్తు విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలకు అప్లయ్ చేసుకునేందుకు కోటి మందికిపైగా ప్రజాపాలన దరఖాస్తులు అందజేశారు. ఇప్పుడు వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ నేరాల విషయంలో హెచ్చరించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినా.. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా చెప్పదంటూ తెలియజేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడతారని ముందే గ్రహించిన పోలీసులు ముందస్తుగానే హెచ్చరించడం చూశాం. కానీ, కొందరు మాత్రం సైబర్ నేరగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.10 వేలు కాజేశారు. ఆమెకు సంక్షేమ పథకం వర్తింపజేసేందుకు ఫోన్ కు ఓటీపీ వచ్చిందని చెప్పారు. తమకు ఆ ఓటీపీ చెప్తేనే దరఖాస్తు ఓకే అవుతుందని మాయమాటలు చెప్పి.. ఆమె వద్ద ఓటీపీ తెలుసుకున్నారు. ఇంకేముంది ఆమె ఖాతా నుంచి రూ.10 వేలు మాయం చేశారు.

అసలు ప్రాసెస్ ఏంటి?:

కోటి మందికి పైగా తెలంగాణ పౌరులు అభయహస్తం పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారు. వారు వారి దరఖాస్తులను నేరుగా అధికారులకు అందజేసి రసీదులు కూడా పొందారు. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన అధికారిక ఆపరేటర్లు ఈ వివరాలను కంప్యూటర్లలో ఎంటర్ చేస్తున్నారు. ఈ విధానం ముగిసిన తర్వాత డోర్ టూ డోర్ ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పటికే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. అర్హులైన అందరికీ పథకాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల ఫోన్లకు స్పందించొద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దంటూ సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి