గత కొంతకాలంగా సినిమా పరిశ్రమను మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు వివిధ కారణాల చేత మృత్యువాత పడుతున్నారు. ఈ మరణాలు ఇండస్ట్రీతోపాటుగా సినీ ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సీనియర్ నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మరణాలను మరచిపోకముందే మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు. పలు సినిమాల్లో విలన్ గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు గుండెపొటుతో మరణించాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత తన సోషల్ మీడియా ద్వారా తెలియపరిచాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రముఖ తమిళ, మలయాళ నటుడు కజాన్ ఖాన్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ NM బాదుషా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గత కొంతకాలంగా కజాన్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. గుండెపోటుతో కన్నుమూశారు. కజాన్ ఖాన్ 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో అమ్మకొడుకు) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన సినీ కెరీర్ లో ఎన్నో విలన్ రోల్స్ చేసి మెప్పించారు. గంధర్వ, సీఐడీ ద మూస, డ్రీమ్స్, మాయమోహిని లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఇక కజాన్ ఖాన్ నటించిన చివరి చిత్రం 2015లో వచ్చిన “లైలా ఓ లైలా” చిత్రం. కజాన్ ఖాన్ మృతితో తమిళ, మలయాళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.