Dharani
Dharani
సీనియర్ హీరో ప్రశాంత్ గురించి ఈతరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. దశాబ్దం క్రితం వరకు ఆయన సౌత్లో టాప్ హీరోగా రాణించాడు. తమిళ్లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేశాడు.. తెలుగు, హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సౌత్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకుడు మాత్రమే కాక నటుడు కూడా. ఇక ప్రశాంత్ 17వ ఏటనే వైగాసి పోరంతచ్చు అనే తమిళ సినిమాతో నటుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఇక ప్రశాంత్ తన కెరీర్లో లెజండ్రీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో జీన్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రశాంత్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అజిత్, విజయ్ వంటి హీరోలకు ధీటుగా కెరీర్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్ కెరీర్.. భార్యతో వివాదాల కారణంగా పాతాళానికి పడిపోయింది.
ఈ క్రమంలో తాజాగా ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజ్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రశాంత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, భార్యతో గొడవలు తదితర అంశాల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అవి ఆయన కెరీర్పై ప్రభావం చూపాయి. దాంతో ఆయన సినిమాల నుంచి తప్పుకున్నారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రశాంత్కు చాలా సమయం పట్టింది. ఆలోపే వేరే నటులు తెరంగ్రేటం చేసి.. పాపులారిటీ సంపాదించుకున్నారు. దాంతో ప్రశాంత్ కెరీర్ ముగిసిపోయిందనే చెప్పవచ్చు’’ అన్నారు కాంతరాజ్.
‘‘ప్రశాంత్కు 2005లో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో వివాహం జరిగింది. మూడేళ్ల పాటు బాగానే ఉన్నారు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. వివాహం అయిన మూడేళ్ల తర్వాత వారు విడిపోయారు. ప్రశాంత్ నుంచి విడిపోయి.. పుట్టింటికి చేరుకున్న గృహలక్ష్మి.. పాపకు జన్మనిచ్చింది. బిడ్డను చూసేందుకు ప్రశాంత్ గృహలక్ష్మి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. కానీ వారు అందుకు అనుమతించలేదు. భార్యతో కలిసి ఉండేందుకు ప్రశాంత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవి ఫలించలేదు. ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలే జరిగాయి’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘ఇదిలా ఉండగానే నారాయణన్ అనే మరో వ్యక్తి.. ప్రశాంత్ దంపతుల మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ కన్నా ముందే తాను గృహలక్ష్మిని వివాహం చేసుకున్నాను అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1998లోనే గృహలక్ష్మి తనను వివాహం చేసుకుందని నారాయణన్ చెప్పుకొచ్చాడు. అప్పటికే ప్రశాంత్, గృహలక్ష్మిల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. నారాయణన్ రాకతో.. వివాదాలు మరింత ముదిరాయి’’ అని చెప్పుకొచ్చాడు కాంతరాజ్.
‘‘ఈ క్రమంలో ప్రశాంత్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కుమార్తెను తనకు అప్పగించాలని కోరాడు. అయితే కోర్టు కేవలం విడాకులు మాత్రమే మంజూరు చేసింది.. బిడ్డను అతడికి అప్పగించలేదు. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, వివాదాలు ప్రశాంత్ ఇమేజ్ను భారీగా దెబ్బ తీశాయి. కొన్నాళ్లు ఆయన సినిమాలకు దూరంగా ఉండటం.. ఈలోపు అజిత్, విజయ్ లాంటి స్టార్లు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు కాంతరాజ్.