Mancherial Crime News: ఆస్పత్రిలో గొడవ పడ్డ పేషెంట్స్.. నిద్రపోయిన టైమ్ చూసి బెడ్ పైనే హత్య!

ఆస్పత్రిలో గొడవ పడ్డ పేషెంట్స్.. నిద్రపోయిన టైమ్ చూసి బెడ్ పైనే హత్య!

క్షణికావేశంలో కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగించేస్తున్నారు. ఏదో విషయమై గొడవ పడి కొట్టుకోవడం, పరిస్థితి చేయి దాటితే హత్యలు చేసుకోవడం వంటి ఘటనలను మనం లైవ్ లోనే చూశాం. కానీ, ఆస్పత్రిలో ఓ పేషెంట్ మరో రోగితో గోడవ పడి ఆ తర్వాత హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? కానీ, తెలంగాణలోని ఓ జిల్లాలో అదే జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఆస్పత్రిలోనే ఆ రోగులు ఎందుకు గొడవపడ్డారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన దేవయ్య (49) అనే వ్యక్తి అనారోగ్యంతో మంచిర్యాల ఆస్పత్రిలో చేరాడు. అయితే, ఇదే ఆస్పత్రికి సుధాకర్ అనే వ్యక్తి చికిత్స కోసం వచ్చాడు. వైద్యులు ఇతనికి దేవయ్య పక్కనే బెడ్ ను కేటాయించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అక్కడున్న మందులు పెట్టుకునే అల్మారా విషయంలో గొడవ పడ్డారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు మాటల దాడి చేసుకున్నారు. దీంతో సుధాకర్ దేవయ్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన దేవయ్యను హత్య చేయాలని అనుకున్నాడు.

ఇక ఇందులో భాగంగానే అతడు నిద్రపోయిన టైమ్ లో సుధాకర్ కత్తితో దేవయ్యను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్పందించిన అతడి భార్య వైద్యులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించి మెరుగైన వైద్యం కోసం దేవయ్యను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇక చికిత్స పొందుతూ దేవయ్య బుధవారం ప్రాణాలు విడిచాడు. దీంతో అతని భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: విషం తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య! ఎందుకంటే?

Show comments