iDreamPost

పత్రిక వార్త – ఆ వివరాలు మిస్సయ్యాయ్‌ సర్‌!!!

పత్రిక వార్త – ఆ వివరాలు మిస్సయ్యాయ్‌ సర్‌!!!

‘సర్‌ క్వాలిటీ సెల్‌ రిపోర్ట్‌ వచ్చింది.. ఈ రోజు మన పేపర్‌లో చాలా ముఖ్యమైన వివరాలు మిస్సయ్యామని క్వాలిటీ సెల్‌ ఇంచార్జి రిపోర్ట్‌లో రాశారు’ అంటూ ఆనాడు, ఈజ్యోతి యాజమాన్యాల పీఏలు చెప్పుకొస్తున్నారు మీటింగ్‌లో.

యాజమాన్యాలు: ఏంటయ్యా అంత ముఖ్యమైన వివరాలు?

పీఏలు: అదే సర్‌.. పోయిన వారం చంద్రబాబు మాజీ పీఏ పెండాల్య శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ స్నేహితుడు కిలారు రాజేశ్‌ చౌదరి ఇళ్లు, కంపెనీల్లో సోదాలు నిర్వహించారు కదా.. ఆ వివరాలను నిన్న ఐటీ శాఖ వాళ్లు బయటపెట్టారు.

యాజమాన్యాలు: ఆ వార్త పెట్టేశాంగా.. ఇంకేం వివరాలు కావాలి?

పీఏలు: మన రెండు పేపర్లు తప్ప.. మిగతా అన్ని పేపర్లు, ఇంగ్లిష్‌ పేపర్లు కూడా సోదాలు జరిగిన వారి పేర్లు రాశాయి. మన పత్రికల్లో రాయలేదు..

యాజమాన్యాలు: ఆ క్వాలిటీ సెల్‌ ఇంచార్జి కొత్త వ్యక్తా? ఏది ఒక సారి ఇటు పిలవండి. కాస్త ట్రైనింగ్‌ ఇద్దాం.

ఆదరాబాదరాగా వచ్చి క్వాలిటీ సెల్‌ ఇంచార్జి మీటింగ్‌లో కూర్చున్నారు.

ఏంటయ్యా.. ఏవో వివరాలు మిస్సయ్యాం అని రాశావంట. ఏ వివరాలు కవర్‌ చేయాలో.. ఏవి మిస్‌ కొట్టాలో మాకు తెలియదా?

క్వాలిటీ ఇంచార్జి: సర్‌.. నిన్నే ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం జగన్‌కు మోదీ అక్షింతలు వేశారని ఎక్స్‌క్లూజివ్‌గా రాశాం కదా. వాళ్ల మధ్య ఏం జరిగిందో పక్కనే కూర్చొని విన్నట్లు వార్త అల్లేశాం కదా. ఇప్పుడు 2,000 కోట్ల అంశంలో అందరికీ తెలిసిన విషయాలు కూడా మనం రాయలేదు సర్‌. అందుకే ఆ విషయాన్ని ప్రస్తావించా సర్‌.

యాజమాన్యాలు: అది వేరు.. ఇది వేరు.. ఇప్పుడు చెప్తా విను..

‘‘ సీఎం జగన్‌ చదువుకునే రోజుల్లో ఆయన కాలేజీ అటెండర్‌ ఇప్పుడు ఏదైనా 500 దొంగ తనం చేసి ఉంటే చెప్పు.. మనం ఎక్స్‌క్లూజివ్‌గా వార్త వేసేద్దాం. జగన్‌ అటెండర్‌ భారీ దోపిడీ అని హెడ్డింగ్‌ కూడా పెట్టేద్దాం. అది మనకు పెద్ద అచీవ్‌మెంట్‌.

జగన్‌ పార్టీ పెట్టిన కొత్తలో ఆయన పార్టీలో ఉండి.. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఐటీ సోదాలు జరిగితే చెప్పు.. జగన్‌ పార్టీ లీడర్‌ ఇంట్లో ఐటీ దాడులు.. వేలాది కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంటూ రాసేద్దాం. అప్పుడు రిపోర్టర్‌కు ప్రమోషన్‌ గ్యారెంటీ.

జగన్‌ స్నేహితుడి స్నేహితుడి స్నేహితుడి ఇంట్లో ఓ వ్యక్తిపై ఈడీ కేసు నమోదు చేసి ఉంటే చెప్పు.. జగన్‌ స్నేహితుడిపై ఈడీ కేసు అని రాసేద్దాం. అప్పుడు సబ్‌ఎడిటర్‌కు జీతం కూడా పెరుగుతుంది.’’ ఇదిగో ఇలాంటి విషయాలపై మనం ఫోకస్‌ చేయాలి.

లేదంటే గతంలో భారతంలో అర్జునిడికి.. చంద్రబాబు మనవడికి లింక్‌ పెట్టి వార్త రాశాం గుర్తుందా?

హిల్లరీ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అని పెట్టాం గుర్తుందా?

చంద్రబాబు దెబ్బకు ప్రధాని మోదీ గజగజ అని రాశాం గుర్తుందా?

ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీకి భయం అని రాశాం అదైనా గుర్తుందా?

దావోస్‌లో రెండంచెల బట్టలు వేసుకొని పెట్టుబడుల కోసం చంద్రబాబు తిరిగాడని రాశాం గుర్తుందా?

అమెరికా వీధుల్లో నడుచుకుంటూ తిరిగి పెట్టుబడులు సాధించాడని గుర్తుందా?

పోయి ఆ వార్తలన్నీ చదువు. మనకు ఏ అంశాలు ప్రాధాన్యమో.. ఏవి అప్రధాన్యమో తెలుస్తుంది అంటూ ఆ క్వాలిటీ సెల్‌ ఇంచార్జికి హితబోధ చేశాయి యాజమాన్యాలు.

ఇంకేముంది.. ఈ వివరాలన్నీ విన్న అక్కడి కొత్త రిపోర్టర్‌ కొత్త కథనాలు రెడీ చేయడానికి సిద్ధమైపోయాడు.

జగన్‌కి షాక్‌.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు సర్వం సిద్ధం అంటూ ఒక వార్త..

కేంద్రంలో ప్రధాని పీఠంలోకి చంద్రబాబు అంటూ మరో వార్త !!

లోకేశ్‌కు సీఎం పదవి ఇవ్వాలంటూ ప్రజల ఆందోళనలు అంటూ మరో వార్త !!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి