iDreamPost

సంప్రదింపులకు ఒక కమిటీ వేసిన కాంగ్రెస్

సంప్రదింపులకు ఒక కమిటీ వేసిన కాంగ్రెస్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షుడిగా 11 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విధానాలను నిర్ణయించేందుకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి వర్కింగ్‌ కమిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొత్తగా కమిటీని నియమించడం విశేషం.

ఈ కమిటీ ప్రతిరోజు సమావేశమై కరోనా నేపద్యంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు, మేధావులు,సమాచార నిపుణులతో చర్చించి కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన విధానాలు రూపొందించటానికి ఈ కమిటీ పనిచేస్తుంది.

ఈ కమిటీకి కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.సంప్రదింపుల కమిటీలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం,సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌,కేసీ వేణుగోపాల్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. అలాగే ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లబ్,సుప్రియ శ్రైనేట్‌లతో పాటు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి రోహన్ గుప్తా కూడా కమిటీలో సభ్యులుగా పనిచేయనున్నారు.

ఎఫ్‌డీఐలపై రాహుల్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం:

రాష్ట్రాలలో విదేశాల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కేంద్రం నిర్ణయానికి రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు.ఈ నెల 12న రాహుల్‌ గాంధీ ‘‘ఈ కరోనా సంక్షోభం సమయంలో భారత కంపెనీలను టేకోవర్‌ చేసేందుకు అనేక విదేశీ సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.అయితే విదేశీ పెట్టుబడులను అనుమతించడానికి ఇది సరైన సమయం కాదు. ఎఫ్‌డీఐలను అనుమతించకుండా దేశంలోని కంపెనీలను కాపాడాలి’’ అని ట్వీట్‌ చేశారు.

శనివారం కేంద్ర ప్రభుత్వం భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానాలలో కీలక మార్పులు చేసింది.‘‘నా హెచ్చరికను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని రాహుల్‌ శనివారం ట్వీట్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి