iDreamPost

UGC NET 2024: విద్యాశాఖ కీలక నిర్ణయం.. యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు

  • Published Jun 20, 2024 | 8:25 AMUpdated Jun 20, 2024 | 8:25 AM

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఓ పరీక్ష నిర్వహణలో లోపం ఉన్నట్లు గుర్తించడమే కాక దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఓ పరీక్ష నిర్వహణలో లోపం ఉన్నట్లు గుర్తించడమే కాక దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 20, 2024 | 8:25 AMUpdated Jun 20, 2024 | 8:25 AM
UGC NET 2024: విద్యాశాఖ కీలక నిర్ణయం.. యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల కాలం నడుస్తోంది. మెడికల్‌ సహా పలు ఎగ్జామ్స్‌ కోసం ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని రాష్ట్రావ్యాప్తంగా నిర్వహించే పరీక్షలు ఉంటే.. మరి కొన్ని జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జామ్స్‌ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో పరీక్షల పేపర్ల లీక్‌ అంశం దేశాన్ని కుదేపేస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల పేపర్లు కూడా లీక్‌ కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష పేపర్లు కూడా లీక్‌ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా మందికి ఒకేలాంటి మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. పలు రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ పరీక్షరద్దు చేసింది. ఆ వివరాలు..

దేశ వ్యాప్తంగా రగులుతోన్న నీట్‌ యూజీసీ పరీక్ష వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే యూజీసీ నెట్‌-2024 పరీక్ష. జూన్‌ 18వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం అధికారిక ప్రకటన వెల్లడించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ లలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను రద్దు చేసిన కేంద్రం.. మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ముందు నీట్‌ పరీక్ష.. ఇప్పుడు నెట్‌ నిర్వహణలో లోపం.. దాంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11,21,225 మంది అభ్యర్థులు యూజీసీ నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,35,587 మంది మహిళలు, 4,85,579 మంది పురుషులు, 59 మంది థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే.. రెండు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 9,08,580 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపింది. కానీ ఇంతలో పేపర్ లీకైనట్లు తెలియడంతో.. యూజీసీ నెట్-జూన్ 2004 పరీక్ష రద్దు చేసినట్లు ప్రకటించింది.

నెట్‌ పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ)కు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్.. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దాంతో పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే నీట్ పరీక్షలో అవకతవకలతో ఎన్టీఏ పేరు మసకబారింది. తాజాగా నెట్ పేపర్ లీక్ కావడతో.. ఎన్టీఏ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. నీట్‌(ఎన్‌ఈఈటీ), నెట్‌(ఎన్‌ఈటీ) పేర్లు రెండు దాదాపు ఒకటేగా ఉండటంతో చాలా మంది నీట్‌ పరీక్ష రద్దు చేశారని కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. కానీ ఎన్‌టీఏ రద్దు చేసింది UGC NET పరీక్ష మాత్రమే. .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి