iDreamPost

హైదరాబాద్ వాసులకు ఆధార్ సంస్థ షాక్..

హైదరాబాద్ వాసులకు ఆధార్ సంస్థ షాక్..

ఒకపక్క దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడుకుతున్న సమయంలో భారత పౌరులకు ఆధార్ కార్డు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) హైదరాబాదీలకు షాక్‌నిచ్చింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలసిందిగా హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20 లోగా విచారణకు రావాలని యూఐడీఏఐ ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

హైద్రాబాద్‌ లో నివసిస్తున్న సత్తర్‌ ఖాన్‌ అనే ఆటో రిక్షా ​డ్రైవర్‌ నకిలీ ధృవపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నాడన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ (యూఐడీఏఐ) ఫిబ్రవరి 3న అతనికి నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం కలిగివుంటే తగిన పత్రాలను చూపించాలని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాలు చూపకపోయినా, గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒకవేళ భారతీయులు కాకపోతే, చట్టబద్ధంగానే తాము దేశంలోకి ప్రవేశించామని నిరూపించుకోవాలని ఉడాయ్‌ (యూఐడీఏఐ) సంస్థ తెలిపింది. లేని పక్షంలో ఈ కేసుని సుమోటోగా తీసుకుని సదరు వ్యక్తికి చెందిన ఆధార్‌ కార్డు ని రద్దు చేస్తామని వెల్లడించింది.

నోటీసులు అందుకున్న సత్తర్‌ ఖాన్‌ మంగళవారం ఈ నోటీసులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఐడీఏఐకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో సదరు అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ పోలీసులు తమకిచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం అక్రమ వలసదారులకు ఆధార్‌ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్‌లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేయడంపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ఉడాయ్‌ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఆధార్‌ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం విరమించుకోవాలని, ఇలా చేయడానికి వారికి చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్‌ ట్వీట్‌ చేశారు.

ఉడాయ్ జారీచేసిన నోటీసు లో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, అసలు ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ తరహా నోటీసును జారీ చేసిన ఉడాయ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ మరో ట్వీట్ చేశాడు. ఇది ఇలా ఉండగా మొత్తం 127 మందికి నోటీసులు జారీ చేసిన ఉడాయ్‌ అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని వారిని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి