iDreamPost

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించాం.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించాం.

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

The Tirumala Tirupati Devasthanams ,TTD
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించాం.
రెండో విడతలో శ్రీవాణి ట్రస్టు నిధులతో దశలవారీగా ఆలయాల నిర్మాణం చేపడతాం. ఈ ఆలయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమరసత సేవ ఫౌండేషన్‌తోపాటు దేవాదాయశాఖ ద్వారా, ఆయా జిల్లా యంత్రాంగాల ద్వారా నిర్మించేందుకు చర్యలు చేపడతాం.

– డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రారంభిస్తాం. ఒక నెలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం. తిరుపతి లోని మాధవంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు, గదులు కేటాయించడం జరుగుతుంది.

– జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తాం. పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ఇందుకోసం రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తాం. అదేవిధంగా రోజుకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేస్తాం. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబడరు.

– తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని వినియోగిస్తాం. బంగారు తాపడం పనుల కోసం 1957-58 సంవత్సరంలో టీటీడీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తాం.

– అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశాం. త్వరలో మొదటి దశ టెండర్లను పిలవడం జరుగుతుంది.

– టిటిడిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఈఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. వచ్చే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సమర్పిస్తారు.

– భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని నందకం విశ్రాంతి గృహంలో మంచాలు తదితర ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ.2.95 కోట్లు మంజూరు.

– తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9.05 కోట్లతో టెండరుకు ఆమోదం.

– తిరుమల బాలాజి నగర్‌ ప్రాంతంలో అంతర్గత రోడ్లు, పార్కింగ్‌ ప్రదేశం, మురుగుకాల్వల నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు.

– తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద గదుల ఆధునీకరణ ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.3.80 కోట్లు మంజూరు.

– ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను రాష్ట్ర రైతు సాధికార సంస్థ సహకారంతో ఎపి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ఆమోదం.

– జమ్మూలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి పనులు, వసతులు కల్పించేందుకు గాను 10 రకాల పనులను రూ.7 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం.

– తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో బాలుర హాస్టల్‌ భవనంలో అదనపు అంతస్తు నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు.

– టిటిడి ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు గాను మందుల కొనుగోలుకు రూ.2.56 కోట్లు, సర్జికల్‌ సామగ్రి కొనుగోలుకు రూ.36 లక్షలు మంజూరు.

– తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.3.75 కోట్లు మంజూరు.

– టిటిడిలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2022 శ్రీవారి బ్రహ్మోత్సవ బహుమానం చెల్లింపునకు ఆమోదం. టిటిడిలో 7 వేల మంది రెగ్యులర్‌, 14 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు.
రెగ్యులర్‌ ఉద్యోగులకు – 14000/-
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు – 6850/-.

అనంతరం టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో లడ్డు కౌంటర్లలో ఇటీవల తలెత్తిన సమస్య గురించి సుదీర్ఘంగా వివరించారు. ప్రస్తుతానికి లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవని మరో పది రోజుల్లో నూతన సిబ్బంది ద్వారా లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి