iDreamPost

APలో దారుణం.. అత్తను కిరాతకంగా హత్య చేసిన అల్లుడు!

APలో దారుణం.. అత్తను కిరాతకంగా హత్య చేసిన అల్లుడు!

నేటికాలంలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మనిషిలో సహనం అనేది లేకుండా పోతుంది. అందుకే ప్రతి విషయానికి కొందరు ఆవేశానికి లోనవుతుంటారు. అలానే మరికొందరు పగలు పెంచుకుని హత్యలకు పాల్పడుతున్నారు. సొంత కుటుంబం వారిపైనే కొందరు దాడికి పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అత్తను ఆమె అల్లుడే కత్తితో దారుణంగా నరికి చంపాడు. మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. వేగంగా బైక్‌ నడిపి తప్పించుకోగలిగాడు. పోలీసులు తెపిన వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ వైఎస్సార్‌ కాలనీకి చెందిన గోగుల నాగమణి (50), గురుస్వామి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె లలితను ఏకలవ్యనగర్‌కు చెందిన రాజేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన చాలా కాలం పాటు వారిద్దరు సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా రాజేశ్, లలిత మధ్య గొడవలు జరగడంతో పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి లలిత పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం కేసు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో రాజేశ్‌.. తన భార్యతో విడిపోవడానికి అత్తామామలే కారణమని భావించాడు. వారిపై పగ పెంచుకున్న రాజేశ్.. అత్తామామను చంపేందుకు ప్లాన్ చేశాడు.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో తమ నివాసం నుంచి సాయిరాం థియేటర్‌ వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె  ఇంటికి నాగమణి, గురుస్వామి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరి బైక్‌ను ఇంటి నుంచే రాజేశ్‌ మరొక వ్యక్తితో కలిసి మరో బైక్ పై వెంబడించాడు. పట్టణంలోని నైనవరం వంతెన మధ్యన ఉన్న పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ వద్దకు వచ్చేసరికి బైక్‌ వెనుక కూర్చున్న నాగమణిపై రాజేశ్ కత్తితో వేటు వేశాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ కింద పడిపోయింది. అలా పడిపోయిన ఆమెను మెడపై కత్తితో నరికాడు. అదే సమయంలో బైక్‌పై ఉన్న గురుస్వామి భయంతో బైక్ వేగం పెంచి.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

కాగా, రక్తం మడుగులో పడి ఉన్న నాగమణి విలవిల్లాడి.. ఘటనాస్థలంలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ దారుణ హత్య నేపథ్యంలో ఫ్లై ఓవర్‌కు మూడు వైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి… ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి