Jio, Airtel వదిలి BSNLకు క్యూ కడుతున్న ప్రజలు! కొత్తగా 25 లక్షల మంది సబ్ స్క్రైబర్స్!

BSNL Gains New Subscribers-Tariff Price Hiked In Jio, Airtel: ప్రైవేటు టెలికాం కంపెనీలైనా జియో, రిలయన్స్‌ను వదిలి జనాలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు క్యూ కడుతున్నారు. అందుకు కారణం ఇదే..

BSNL Gains New Subscribers-Tariff Price Hiked In Jio, Airtel: ప్రైవేటు టెలికాం కంపెనీలైనా జియో, రిలయన్స్‌ను వదిలి జనాలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు క్యూ కడుతున్నారు. అందుకు కారణం ఇదే..

మన దేశంలో ప్రభుత్వ రంగంలో నడిచే టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరు ఈ మధ్య కాలంలో తరచుగా తెర మీదకు వస్తోంది. మీడియా, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు.. భారీ లాభాలు చవి చూస్తే.. వెలిగిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ హావా గత 10-15 ఏళ్లుగా తగ్గుతూ వస్తోంది. అందుకు కారణం.. ఎయిర్‌టెల్‌, జియో వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని.. తమ కస్టమర్లకు తక్కువ ధరలో మంచి కనెక్టివిటీ, డేటాను అందించడం వంటి అంశాలు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ పతనానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు.

ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు.. 5జీని అందుబాటులోకి తెచ్చి.. 6జీ వైపుగా పరుగులు తీస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా 3జీ దగ్గరే తచ్చాడుతుంది. ఇక గత కొన్నాళ్లుగా నష్టాల బాటలో కొనసాగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ దశ ఇప్పుడే తిరుగుతోంది. జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెత్తిన పాలు పోశాయి అని చెప్పవచ్చు. ఇంతకు ఏం జరిగింది అంటే..

జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు.. తాజాగా తమ రీచార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ప్రతి కంపెనీ.. ఇప్పడు ఉన్న రేట్ల మీద 12-25 శాతం వరకు పెంచాయి. ప్రైవేటు టెలికాం కంపెనీల నిర్ణయం పట్ల కస్టమర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇదే సమయంలో టెలికాం కస్టమర్ల చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ మీద పడింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచలేదు. దాంతో కస్టమర్ల చూపు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మీద పడింది. జూలై 4 నుంచి టెలికాం కంపెనీలు.. రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పటికి 15 రోజులు అవుతుంది. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీల నిర్ణయం వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ పంట పండింది. ఈ 15 రోజుల వ్యవధిలోనే సుమారు 25 లక్షల మంది.. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు.

కారణం ఇదే..

జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వంటి కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచడంతో.. సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కి ఘర్‌వాప్సి హాష్‌ ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇదే సమయంలో సుమారు 25 లక్షల మంది జియో, ఎయిర్‌టెల్‌, వీఐ కస్టమర్లు.. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ ద్వారార బీఎన్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇంత భారీ సంఖ్యలో కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మానడం వెనక ప్రధాన కారణం.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరల పెంపు.

ఎయిర్‌టెల్‌, జియోలో 365 రోజుల ప్లాన్‌ ధర రూ.3,599గా ఉంది. ఇదే బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయానికి వస్తే.. ఇక్కడ 365 రోజుల ప్లాన్‌ ధర రూ.2,395గా ఉంది. జియో, ఎయిర్‌టెల్‌కు సంబంధించి 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ల ధరలు 189-199 రూపాయల మధ్య ఉండగా.. ఇదే బెనిఫిట్స్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌లో 108 రూపాయలకే 28 రోజుల ప్లాన్‌ అందుబాటులో ఉంది.

అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభంజనం ఇలానే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. పైగా తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌.. టీసీఎస్‌తో జత కట్టింది. ఫలితంగా త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. అలానే 2025 నాటికి 5జీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వ వైభవం వస్తుందని.. కాకపోతే.. 4జీ, 5జీ అందుబాటులోకి తెచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతుందా.. ఇదే విధంగా కొనసాగిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధరలను పెంచకపోతే.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను కొట్టే వారే ఉండరు అంటున్నారు. మరి భవిష్యత్తు ఎలా ఉండనుందో చూడాలి.

Show comments