iDreamPost
android-app
ios-app

ఇది సినిమా కాదు బాలకృష్ణ..

ఇది సినిమా కాదు బాలకృష్ణ..

సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హితవు పలికారు. గురువారం బాలయ్య తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోకి రాగా.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకుని ‘బాలకృష్ణ గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. తాను కనుసైగ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ హింసకు తాను వ్యతిరేకమన్నారు.

ఈ విషయంపై మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హిందూపురానికి తాగునీరు తెచ్చే అమృత్‌ పథకంలో తెలుగు దొంగల అవినీతి త్వరలో బయట పడుతుందని తెలిపారు.