UP Pakistani Flag: ఇంటిపై పాకిస్తాన్‌ జెండా ఎగురవేశారు.. పోలీసులు ఏం చేశారంటే

ఇంటిపై పాకిస్తాన్‌ జెండా ఎగురవేశారు.. పోలీసులు ఏం చేశారంటే

కొందరు మనుషుల తీరు చూస్తే.. అసలు వారిని ఏం అనాలో అర్థం కాదు. ఈ దేశంలో ఉంటూ.. ఇక్కడి సౌకర్యాలను అనుభవిస్తూ.. మన శత్రుదేశం పాకిస్తాన్‌పై ప్రేమను చాటుకుంటారు. అలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తుంది. వారికి పాక్‌ మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడికే వెళ్లవచ్చు కదా. కానీ వెళ్లరు.. ఇక్కడి ఉప్పు తింటూ.. పాక్‌ జెండాలు మోస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఇంటి మీద పాకిస్తాన్‌ జెండా ఎగురవేశారు తండ్రీకొడుకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసులు దీనిపై తీవ్రంగా స్పందించారు. దేశ ద్రోహం చట్టం కింద సదరు తండ్రీకొడుకులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, మొరాదాబాద్‌ జిల్లా భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్‌పూర్ అలీగంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారి రయీస్‌ తన కుమారుడితో కలిసి.. ఇంటి మీద పాకిస్తాన్‌ జెండా ఎగురవేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరింది. దాంతో వారు రయీస్‌, అతడి కుమారుడు సల్మాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మీద దేశద్రోహ నేరం అభియోగంతో పాటు.. ఐపీసీ సెక్షన్‌ 153 ఏ, 153 బీల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులతో పాటు స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం కూడా వారిని విచారిస్తోంది. నిందితులిద్దరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు. వారి ఇంటిపై పాకిస్థాన్‌ జెండాను ఎగురవేయడానికి గల కారణాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు, అయితే వారు ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నివేదికల ప్రకారం.. జాతీయ ఐక్యత, భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలపై తాము కఠిన చర్యలు తీసుకున్నామని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. జనాలు.. ఈ తండ్రీకొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డ మీద పుట్టి.. పాక్‌ జెండాను ఎగురవేసిన ఇలాంటి ద్రోహులను.. దేశం నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాక ఈ తండ్రీకొడుకులకు పాక్‌ అంటే చాలా ఇష్టమని.. వారిని అక్కడకు పంపడమే మంచదని కామెంట్‌ చేస్తున్నారు.

Show comments