కాదేదీ మోసానికి అనర్హం అంటుంటారు. నిజమే.. మోసపోయేవాళ్లున్నంత కాలం.. మోసం చేసేవారు చేస్తూనే ఉంటారు. ఈ మోసం చేసే వారిలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. చాలా మంది మహిళలు వివిధ రంగాలల్లో కష్టపడి పని చేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇతరులను మోసాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఆడవాళ్లు.. తమ అందంతో మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కానీ మగవాళ్లనే లక్ష్యంగా చేసుకుని కొందరు కిలేడీలు మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి 8 మందిని పెళ్లి చేసుకుని.. వారి నుంచి నగదు, బంగారు నగలతో పారిపోయింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం సేలాం జిల్లా తారమంగళా ప్రాంతానికి చెందిన మూర్తి అనే వ్యక్తి ఫైనాన్షియర్ గా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం పాటు స్నేహంగా చాట్ చేసుకున్న వారిద్దరు.. చివరకు ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మార్చి 30న వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొన్నిరోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రషీద జూలై 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల డబ్బు, 5 సవర్ల బంగారు నగలతో పారిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మూర్తి.. రషీద, ఇంట్లోని వస్తువులు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో రషీదపై ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. నీలగిరి జిల్లా గూడలూర్ కు చెందిన రషీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తెరచి.. డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకునేది. ఆ తరువాత వాళ్లను తన ట్రాప్ లో పడేసుకుని వివాహం చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత వారితో వాగ్వాదం పెట్టుకుని ఇంట్లో ఉన్న నగదు, బంగారు నగలతో పారిపోతుంది. ఇలా ఇప్పటివరకు రషీద ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి.. ఇలా పెళ్ళి పేరుతో యువకులను మోసం చేస్తున్న ఇలాంటి ఆడవాళ్లకు ఎలాంటి శిక్షలు విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: క్షణకాల సుఖం కోసం.. కన్న ప్రేమను మరిచి కసాయిగా మారిన తల్లి!