Tirupathi Rao
Tirupathi Rao
పిల్లలను కనగలం గానీ.. వారి బుద్ధులను కనలే అంటారు. అది నిజంగా నిజమనే చెప్పాలి. కొందరు పిల్లలు స్కూల్ కి వెళ్లి చక్కగా చదువుకుంటుంటే ఇప్పుడు చెప్పుకోబోయే పిల్లాడి లాంటి వాళ్లు లేనిపోని గొడవలు సృష్టిస్తూ ఉంటారు. పాఠశాలలో చదువుకోవడం మానేసి పక్కవాళ్లకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. తాజాగా రాజస్థాన్ లో ఓ విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని వాటర్ బాటిల్ లో మూత్రం పోసి నానా హంగామా సృష్టించాడు. అతను చేసిన పని ఆ ఊరిలో జాతి విద్వేషాలు చెలరేగడానికి కారణం అయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రం ఖిల్వారాలోని లుహారియా గ్రామంలో ఆందోళనలు పెళ్లుబికాయి. ఒక విద్యార్థి చేసిన పనికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే వరకు వచ్చింది. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న ఓ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. 8వ తరగతి చదవుతున్న విద్యార్థిని బాటిల్ లో మూత్రం పోసి అందులో నీళ్లు నింపి ఆమె బ్యాగ్ దగ్గర పెట్టారు. తెలియక ఆ విద్యార్థిని బాటిల్ లో నీళ్లు తాగింది. ఒక గుటక వేసిన తర్వతా ఆమెకు దుర్వాసన వచ్చింది. ఆ నీళ్లు కూడా ఏదో తేడాగా ఉన్నట్లు ఆమె గుర్తించింది. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యురాలికి ఈ విషయాన్ని తెలియజేసింది.
తనకు ఇలా జరిగింది అని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆమె బ్యాగులో ఐ లవ్ యూ అని రాసి పెట్టిన పేపరు కూడా దొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే హెడ్ మాస్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఆమె ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ఈ విషయం పెద్దవాళ్ల వరకు వెళ్లింది. దారుణానికి పాల్పడిన వాళ్లు.. బాధితులు వేర్వేరు వర్గాల వాళ్లు కావడంతో ఈ గొడవ కాస్తా కులాలు, జాతుల రంగు పులుముకుంది. విద్యార్థులపై చర్యలు తీసుకోలేదని బాధితురాలి తరఫు వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయమే స్కూలుకు చేరుకున్నారు. పాఠశాలకు నిందితులపై చర్యలు తీసుకోవాలి అంటూ పాఠశాలకు తాళం కూడా వేశారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “ఓ విద్యార్థిని మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లింది. తన బ్యాగును పాఠశాలలోనే ఉంచింది. అప్పుడు విద్యార్థులు ఆమె బాటిల్ లో మూత్రం కలిపారు. ఆమె బ్యాగులో ఐ లవ్ యూ అని నోట్ కూడా పెట్టారు. అయితే బాలిక ఫిర్యాదుపై హెచ్ఎం చర్యలు తీసుకోలేదు” అంటూ పోలీసులు తెలిపారు. అయితే బాధిత బాలిక బందువులు, కుటుంబసభ్యులు ఎవరైతే ఈ పని చేశారో.. ఆ విద్యార్థుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ గందరగోళం నెలకొనడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీ ఛార్జ్ చేశారు. బాలిక తరఫు నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కానీ, రాళ్లు రువ్విన వారిపై మాత్రం కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలురు చేసింది తప్పు అంటూ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసింది ఎవరైనా వారికి సరైన బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.