Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద ఒక మూర్ఖపు దాడి జరుగుతోంది. ఈ మూర్ఖుల్ని చూసి ఆయన విసిగిపోయి అయ్యో రామ! అంటే , చూశారా. RSS వాళ్లతో కలిసిపోయాడు అంటారు. బాధతో OH Jesus అంటే ఆయన నోరు తెరిస్తే క్రైస్తవ మత ప్రచారమే అని Start చేస్తారు. “యా అల్లా” అంటే అసలు జగనే మర్కజ్ సమావేశానికి మూలకారణమని అని కూడా అనగలరు.
కరోనా భయపడతగింది కాదు అన్నాడు జగన్. దాంతో ఆయనకి ప్రజల పట్ల బాధ్యత లేదని , కరోనాని నిర్లక్ష్యం చేస్తున్నాడని మొదలు పెట్టారు. ఒక వేళ కరోనా అంటే చాలా డేంజర్, అలర్ట్గా ఉండండి అని ఉంటే , చూశారా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే చేతులెత్తేసి జనాల్ని భయపెడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ రకంగా భయపెడితే ఇక సమాన్యుల గతేంటి? – ఇదీ పరిస్థితి.
కరోనా మనతోనే ఉంటుంది, కలిసి జీవించాల్సిందే అని జగన్ అన్నాడు. ఇది వాస్తవమే కదా, వ్యాక్సిన్ కనిపెట్టే వరకు కరోనా దూరం కాదు. మన ప్రయత్నాలన్నీ నివారణకే, నిర్మూలనకి కాదు. ఇదీ ఒక సుదీర్ఘకాల యుద్ధం. జగన్ మూర్ఖంగా మాట్లాడ్డం లేదు. విజ్ఞతతోనే మాట్లాడుతున్నాడు. అంతే తప్ప ప్రజలంతా కరోనా రోగులుగా మారాలని కోరుకోవడం లేదు. జగనే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కోరుకోరు.
“ఎక్కువ భయపడొద్దు. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది”…దీంట్లో తప్పేం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది కదా! భయం వల్ల శవాల్ని అడ్డుకోవడం, కోలుకున్న వాళ్లని సామాజిక వెలి వేయడం జరుగుతున్నప్పుడు
ముఖ్యమంత్రి ధైర్యం చెబితే తప్పా?
జగన్ విలేకరుల సమావేశం పెట్టడం లేదు- ఇదో ఆరోపణ. ఇపుడు కావాల్సింది కరోనాకి చికిత్స కానీ, విలేకరుల సమావేశాలు కాదు. ఆయన రోజూ అధికారుల సమావేశాలు పెట్టి జరగాల్సిన పనులు చూస్తున్నాడు. విలేకరులకి అందాల్సిన సమాచారం అందుతూ ఉంది. వీళ్ల బాధ ఏంటంటే సమావేశం పెడితే తలా తోక లేని ప్రశ్నలు అడిగి కొత్త వివాదం సృష్టించి ఆనందపడాలని.
కరోనా నియంత్రణ అంత సులభం కాదని ఒక వైపు అంటూనే జగన్ నియంత్రించడం లేదని అంటారు. అసలు కరోనా గురించి కేకలు పెట్టే వాళ్లంతా భద్ర జీవితం గడుపుతున్న వాళ్లు. వీళ్లకి వాస్తవాలు తెలియదు, అవసరం లేదు.
మొదట అది ధనవంతుల జబ్బు. ఇపుడు పేదవాళ్లకి మెడకు చుట్టుకుంది. ఈ దేశంలోకి విమానాలు దిగేవాళ్ల ద్వారా వచ్చి ధారవి మురికివాడల్లో ప్రవేశించింది.
కరోనాని ఎదుర్కొనే వాళ్లు, ఎదుర్కోలేని నిస్సహాయులు మనముందున్నారు.
కరోనాని ఎదుర్కొనే వాళ్లు ఖరీదైన అపార్ట్మెంట్లు , విల్లాల్లో ఉంటారు. వీళ్లు ఆరు నెలల సరుకులు , నెలరోజులకి సరిపడా కూరగాయలు భద్రపరచుకోగలిగిన స్థితిమంతులు. పాల పొడితో పాలు చేసుకోగలరు. నిరంతరం శానిటైజర్స్తో శుభ్రపరచుకుంటారు. పనివాళ్లని మాన్పించి కోటాను కోట్ల మంది సాధారణ పనులుగా భావించే ఇంటిపని , వంట పని చేస్తూ అదేదో గొప్ప విషయమన్నట్టు ఫేస్బుక్ పోస్టింగ్లు చేస్తూ , పనికి మాలిన ఛాలెంజ్లు విసురుతూ గడిపేస్తూ ఉంటారు. ఇంకో ఆరు నెలలు లాక్డౌన్ జరిగినా వీళ్లకి వచ్చే ఇబ్బంది లేదు.
నిస్సహాయులు ఎవరంటే కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్లు, కిరాణా వర్తకులు, పాల వ్యాపారులు. ఇవి అమ్మకపోతే బతకలేరు. భౌతిక దూరం సాధ్యం కాదు. పదేపదే శానిటైజర్లు వాడే స్తోమత లేదు. కరోనా అంటే వీళ్లకూ భయమే. కానీ బతుకు భయం దానికి మించింది.
వీళ్లు కాకుండా మధ్య తరగతి, దిగువ తరగతుల్లోని ప్రజలు. నెలలునెలలు స్టాక్ పెట్టుకునే డబ్బు ఉండదు. బయటికి రాక తప్పదు. కరోనా వచ్చిందని చిన్న ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇళ్లలోకి వెళ్లరు. భౌతిక దూరం సాధ్యం కాదు. కరోనా రావడం , రాకపోవడం కేవలం అదృష్టం.
డబ్బున్న వాళ్లు 95 శాతం రక్షణలో ఉంటే లేనివాళ్లు 95 శాతం ప్రమాదంలో ఉన్నారు. డబ్బున్న వాళ్లు, రాజకీయ నాయకులు , సెలబ్రిటీలు వీళ్లంతా కరోనా గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే పేద ప్రజలు చచ్చిపోతారని కాదు, ఇది తమకు ఎక్కడ వస్తుందోననే భయంతో మాత్రమే.
ఏటా లక్షల మందిని తినేసే క్షయ గురించి, మలేరియా గురించి వీళ్లెప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే అది తమకు వచ్చే అవకాశం లేదు కాబట్టి.
ఇంకా కొంత కాలం లాక్డౌన్ కొనసాగితే ఆకలి, పేదరికం చావులు కరోనాను మించిపోతాయి. ఇదంతా అవగాహనలో ఉంది కాబట్టే జగన్ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కరోనాతో కలిసి జీవించడం అనివార్యం అంటున్నాడు.
అలాగని ప్రజావైద్యాన్ని గాలికొదిలేయలేదు. నెలరోజుల్లో కరోనా నివారణకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. అందుకే రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉంది. 1,525 కేసులు చాలా స్వల్పం. అధునాతనమైన న్యూయార్క్లో జరిగిన విధ్వంసంతో పోలిస్తే జగన్ చాలా అద్భుతంగా కరోనాని నివారించినట్టే.
అక్కసుతో , అసూయతో కాకుండా విజ్ఞతతో , వివేకంతో మాట్లాడితే రాష్ట్రానికి మేలు చేసినవాళ్లు అవుతారు.