Idream media
Idream media
ఇటీవల ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని కేంద్రం ప్రశంసించింది. దేశం మొత్తం మీద కంటే ఏపీలోనే ధరలు సాధారణ స్థితికి వచ్చాయని తెలిపింది. శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2019–20లో ఏపీ చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఉల్లిని భారీ ఎత్తున కొనుగోలు చేసి.. నష్టాలను పట్టించుకోకుండా వినియోగదారులకు కేవలం కేజీ రూ. 25కే అందించిందని కొనియాడింది. ఈ చర్యల వల్ల ఉల్లి ధరల తగ్గింపునకు తన వంతు కృషి చేసిందని పేర్కొంది.
Read Also: ఉల్లి ఘాటుకు ఉపశమనం
ధరల పెరుగుదలకు అదే కారణం
దేశంలో ఉల్లిని సాగు చేసే రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురవడంతో ఉల్లి పంట దెబ్బతినిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. ఖరీఫ్ దిగుబడి తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా డిసెంబర్లో ధరలు బాగా పెరిగిపోయాయని తెలిపింది. దాదాపు 450 శాతం పెరిగాయని చెప్పింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లలో పంట సాగు 7 శాతం మేర తగ్గిందని పేర్కొంది. దీంతో కేంద్రం ప్రభుత్వం కూడా ఉపశమన చర్యలు చేపట్టిందని తెలిపింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిషేధించడంతోపాటు ఈజిప్టు, టీర్కీ దేశాల నుంచి దిగుమతులు భారీగా చేసుకున్నట్లు వెల్లడించింది.