సినీ పరిశ్రమలో ప్రతిభ కలిగిన నటులకు ఎప్పుడూ మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే కథానాయికలుగా రాణించాలంటే ఒక్క టాలెంట్ ఉంటేనే సరిపోదు. టాలెంట్కు తోడు గ్లామర్ కూడా ఉండాలి. అందానికి అభినయం తోడైతే ఇక వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. అదే టైమ్లో కాస్త లక్ కూడా కలిసొచ్చి హిట్లు పడాలి. దొరికిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇండస్ట్రీలో ఢోకా ఉండదు. దీనికి మంచి ఉదాహరణగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ను చెప్పొచ్చు. ఒక్కో సినిమాతో తన కెరీర్ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ పోతున్నారామె.
కీర్తి సురేష్ కెరీర్లో కీలక మలుపుగా ‘మహానటి’ చిత్రాన్ని చెప్పొచ్చు. అప్పటివరకు బాగా నటిస్తుందనే పేరున్న కీర్తి.. ఆ ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయారు. ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఇంత బాగా నటిస్తారా అని అందరూ షాకయ్యేలా చేసిందా మూవీ. ‘మహానటి’ తర్వాత కీర్తి జోరుకు అడ్డే లేకుండా పోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆమె బిజీబిజీగా ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్తోనూ ఆడియెన్స్ను ఆకట్టుకుంటున్నారు. అలాంటి కీర్తి తన పారితోషికాన్ని భారీగా పెంచేశారట. ఆ మధ్య విజయాలు లేక రేసులో కీర్తి కాస్త వెనుకబడ్డారు. దీంతో ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు రాలేదు.
తెలుగులో ఛాన్సులు రాకపోయినా కోలీవుడ్లో మాత్రం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి సురేష్. టాలీవుడ్లో ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న టైమ్లో నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ‘దసరా’ మంచి సక్సెస్ను సాధించడం ఆమెకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే తరుణంలో తమిళంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా యాక్ట్ చేసిన ‘మామన్నన్’ కూడా సూపర్ హిట్ కావడం కీర్తిలో మరింత జోష్ నింపింది. ఈ హిట్స్ ఇచ్చిన ఉత్సాహంలో ఆమె తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచేశారట. ఇంతకుముందు వరకు ఒక మూవీకి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ కేరళ భామ.. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇక, కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో ‘కన్నివెడి’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో పాటు ‘తఘుతాత’, ‘సైరన్’ తదితర సినిమాలు చేస్తున్నారు.