iDreamPost

కుర్ర హీరో పేజీలకు పోటీ టెన్షన్

కుర్ర హీరో పేజీలకు పోటీ టెన్షన్

ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద అనూహ్య ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. అంచనాలు ఉన్నవేమో తుస్సుమంటుంటే కుర్ర హీరోల సినిమాలు ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కార్తికేయ 2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కొత్త చిత్రం 18 పేజెస్ ఈ డిసెంబర్ 23 విడుదల కానుంది. సుకుమార్ కథనందించిన ఈ మూవీకి కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అయినప్పటికీ ఎందుకో ఇది పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకున్నారు. ఎప్పుడో ఏడాది క్రితం ప్రమోషన్లు మొదలుపెట్టి ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. షూటింగ్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు.

తీరా చూస్తే ఈ 18 పేజెస్ చిత్రీకరణ ఇంకా హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతూనే ఉంది. చివరి దశ పనులను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దీని మీద ప్రస్తుతానికి బజ్ కనిపించడం లేదు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావడం సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ కంటెంట్ ఉంటే ఇవేవీ అక్కర్లేదనే విషయం అందరికీ తెలిసిందే. కార్తికేయ 2 వల్ల నిఖిల్ కు ఇండియా వైడ్ పాపులారిటీ వచ్చేసింది కాబట్టి ఇకపై చేయబోయే ఏ సినిమా అయినా సరే డబ్బింగ్ రూపంలో ఇతర భాషల్లోకి వెళ్తుంది. నార్త్ లో తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. కార్తికేయ 2 విజువల్ వండర్ కాబట్టి వర్కౌట్ అయ్యింది కానీ ప్రతిసారి అలాంటివే రావుగా

అసలే 18 పేజెస్ చుట్టూ పెద్ద కాంపిటీషన్ ఉంది. రవితేజ ధమాకా అదే డేట్ కి వస్తోంది. ఆల్రెడీ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా జింతాత ఓ రేంజ్ లో రీచ్ అయ్యింది. అంతేకాదు వారం ముందు 16న వచ్చే అవతార్ ది వే టు వాటర్ కనక హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే దాని ప్రభంజనాన్ని తట్టుకుని యూత్ ని ఇటువైపు లాగడం అంత సులభంగా ఉండదు. రణ్వీర్ సింగ్ సర్కస్ సైతం పోటీకి సై అంటోంది. ఇన్ని సవాళ్ల మధ్య నిఖిల్ గెలవాలంటే సూపర్ టాక్ రావాలి. ప్రస్తుతానికి పబ్లిసిటీ స్పీడ్ కనిపించడం లేదు. చేతిలో ఉన్న రెండు మూడు వారాలు అగ్రెసివ్ గా ప్లాన్ చేసుకోవడం అవసరం. ఇందులో శింబు ఒక పాట పాడారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి