iDreamPost

పశ్చిమలో పదమూడు.. శ్రీకాకుళంలో సున్నా..

పశ్చిమలో పదమూడు.. శ్రీకాకుళంలో సున్నా..

కరోనా థర్ట్‌ వేవ్‌ ఆంధ్రప్రదేశ్‌లో చల్లారిపోయింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 79 కేసులు వెలుగుచూశాయి. 14,516 మందిని పరీక్షించగా.. 79 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలడం గమనార్హం. ఈ గణాంకాలు పాజిటివిటీ రేటు భారీ తగ్గిందని చెబుతున్నాయి. మెజారిటీ జిల్లాలో కొత్త కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 11 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ రెండు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలో కొత్త కేసులు 9 లోపే నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కొత్త కేసు నమోదు కాకపోవడం కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఏ స్థాయిలో తగ్గిందో తెలియజేస్తోంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున వైరస్‌ బారిన పడ్డారు. కృష్ణా జిల్లాలో 8 మంది, ప్రకాశం, విశాఖ జిల్లాలలో ఏడుగురు చొప్పన, చిత్తూరులో ఐదుగురు, వైఎస్సార్‌ కడపలో నలుగురు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒక్కరికి కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతం 1064 పాజిటివ్‌ కేసులున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతానికి వైరస్‌ భయం తొలగిపోయినట్లే. మళ్లీ నాలుగో వేవ్‌ వస్తే తప్పా.. కరోనా నుంచి బయటపడినట్లే.

అయితే నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో కరోనా నాలుగో వేవ్‌ వస్తుందని చెబుతోంది. అది ఆగష్టులో గరిష్టస్థాయికి వెళుతుందని, అక్టోబర్‌ నెలాఖరుకు ముగుస్తుందని ఆ నివేదికలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ అంచనా వేసింది. అయితే కరోనా కొత్త వేరియంట్‌ పుడితేనే నాలుగో వేవ్‌ వస్తుందని పేర్కొంది. కొత్త వేరియంట్‌ పుట్టకపోతే.. నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి