మహిళ దాతృత్వం.. ప్రభుత్వ పాఠశాల కోసం రూ.7 కోట్లు విలువ చేసే భూమి విరాళం

నీది నాకే కావాలి.. నాది నాకే కావాలి అనే స్వార్థపూరిత ధోరణితో జీవించే ఈ రోజుల్లో ఓ మహిళా గొప్ప మనసు చాటుకుంది. ప్రభుత్వ పాఠశాల కోసం ఏకంగా రూ.7 కోట్లు విలువ చేసే భూమి విరాళంగా ఇచ్చింది.

నీది నాకే కావాలి.. నాది నాకే కావాలి అనే స్వార్థపూరిత ధోరణితో జీవించే ఈ రోజుల్లో ఓ మహిళా గొప్ప మనసు చాటుకుంది. ప్రభుత్వ పాఠశాల కోసం ఏకంగా రూ.7 కోట్లు విలువ చేసే భూమి విరాళంగా ఇచ్చింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భూములకు విలువ పెరుగుతున్న వేళ అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ల మధ్య భూ తగాదాలు ఎక్కువైపోయాయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఇంచు భూమి కూడా వదులుకునేది లేదని తెగించి కోర్టు మెట్లెక్కుతున్న రోజులివి. అలాంటిది ఓ మహిళ కోట్లు విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చారు. ఉచితాల కోసం ఎదురు చూసే ఈ రోజుల్లో ఏ మాత్రం ఆలోచించకుండా.. ఏ విధమైన లాభాపేక్ష లేకుండా దాతృత్వాన్ని చాటుకోవడం అంటే మామూలు విషయం కాదు. రూ. 7 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాలకు దానమిచ్చినందుకు గాను ఆ మహిళకు ప్రభుత్వం అవార్డును అందించనుంది.

పుచ్చుకోవడమే గాని.. ఇవ్వడం ఎరుగని ఈ రోజుల్లో ఓ మహిళ కోట్లు విలవ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చారు. తమిళనాడులోని మధురైకి చెందిన ఆయిపురాణం అమ్మాళ్ అనే మహిళ ఓ బ్యాంకులో క్లర్క్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. కోడిక్కుళంలోని ఒట్టకడై సమీపంలో ఆమెకు ఒక ఎకరం భూమి ఉంది. దాని విలువ రూ.7 కోట్లు ఉంటుంది. అయితే అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాల విస్తరణ కోసం అదనంగా భూమి అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె.. రిజస్ట్రార్ వద్దకు వెళ్లి తన భూమిని ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆ రిజిస్ట్రేషన్‌ కు సంబంధించిన పత్రాలను తమిళనాడు విద్యాశాఖ అధికారులకు అప్పగించారు.

ఈ విషయం తెలుసుకున్న మధురై ఎంపీ ఎస్ వెంకటేశన్.. జనవరి 11వ తేదీన స్వయంగా కోడిక్కుళం వెళ్లి ఆయిపురాణం అమ్మాళ్‌ ను కలిసి అభినందించారు. కాగా ఆయిపురాణం అమ్మాళ్ చేసిన దాతృత్వానికి గాను ప్రభుత్వం అవార్డు అందించి గౌరవించనుంది. ఆమెను జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా సత్కరించనున్నట్లు స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్  వేదికగా ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా అందించిన అమ్మాళ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి భూమి కోసం ఒకరినొకరు చంపుకునే ఈ రోజుల్లో ఏకంగా రూ. 7 కోట్లు విలువ చేసే భూమిని దానం చేసిన అమ్మాళ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments