దేశాన్ని ఊపేస్తున్న పూణే కారు యాక్సిడెంట్ ఘటన! పూర్తి వివరాలు!

Pune Minor Accident: మద్యం సేవించి.. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమయ్యాడు ఓ మైనర్‌. పూణేలో జరిగిన ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఈ యాక్సిడెంట్‌ పూర్తి వివరాలు మీ కోసం..

Pune Minor Accident: మద్యం సేవించి.. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమయ్యాడు ఓ మైనర్‌. పూణేలో జరిగిన ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఈ యాక్సిడెంట్‌ పూర్తి వివరాలు మీ కోసం..

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వొద్దు.. అతి వేగంతో డ్రైవింగ్‌ చేయడం ప్రమాదం.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.. ఇలా ఎన్ని రూల్స్‌ పెట్టినా.. అవగాహన కోసం ఎంత ప్రచారం కల్పించినా.. కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా కొన్ని కేసుల్లో తల్లిదండ్రులే అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ కోవకు చెందినదే మహారాష్ణ, పూణేలో వెలుగు చూసిన మైనర్‌ యాక్సిండెట్‌ కేసు. 17 ఏళ్ల కుర్రాడు.. అత్యంత ఖరీదైన పార్ష్‌ కారును వేగంగా నడపడంతో.. అది కాస్త అదుపు తప్పి బైక్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో యువతీయువకులు మృతి చెందారు.

ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా ఈ వివాదంలో కోర్టు తీర్పుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మైనర్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరిస్తే.. న్యాయస్థానం మాత్రం కేవలం 15 గంటల వ్యవధిలోనే మైనర్‌ బాలుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ.. కొన్ని చిత్రమైన షరతులు విధించడం సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది అనేది పరిశీలిస్తే..

అసలేం జరిగిందంటే..

ఈ సంఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. పూణేకి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుమారుడు.. తన స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం సేవించాడు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిందుకు గాను ఈ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో పబ్‌ నుంచి ఇంటికి తిరిగి బయలుదేరాడు. తన పోర్ష్‌ కారును అత్యంత వేగంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అది అదుపు తప్పి.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ మీద వస్తోన్న యువతీయువకుడు ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. ఇక ప్రమాద సమయంలో కారు గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్‌ అవధీయ, అశ్వినీ కోస్తాగా గుర్తించారు.

స్పాట్‌లోనే మృతి..

అనీష్‌, అశ్వినీ ఇద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన వారని.. వారు ప్రస్తుతం పూణేలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది. కారు స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టడంతో.. అశ్వినీ గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనీష్‌ రోడ్డు పక్కనే పార్క్‌ చేసి ఉన్న కారును ఢీకొన్నాడని.. వారిద్దరూ స్పాట్‌లోనే చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. అశ్వినీ, అనీష్‌లను ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారని.. యాక్సిడెంట్‌ జరగడంతో.. వీరిలో ఒకరు పరారు కాగా.. మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

వింత తీర్పు..

నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్న నిందితుల విషయంలో కోర్టు వెల్లడించిన తీరుపై సర్వత్రా అసహనం వ్యక్తం అయ్యింది. ఇద్దరు చనిపోవడానికి కారణం అయిన మైనర్‌కు కోర్టు.. కేవలం 15 గంటల వ్యవధిలోనే బెయిల్‌ మంజూరు చేసింది. పైగా నిందితుడిని రోడ్డు ప్రమాదాలపై వ్యాసాలు రాయమని ఆదేశించింది. అంతేకాక 15 రోజుల పాటు యరవాడ పోలీసులతో కలిసి సిగ్నళ్లలో ట్రాఫిక్‌ సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వచ్చాయి. మరో నాలుగు నెలల్లో మైనారిటీ తీరుతుందని.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పోలీసులు విన్నవించినా.. కోర్టు పట్టించుకోలేదు.

మద్యం సేవించి డ్రైవింగ్‌..

ఇక నిందితుడు మద్యం సేవించి వాహం నడిపాడని ఆరోపిస్తుండగా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో అతడికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. కానీ సదరు మైనర్‌ కుర్రాడు.. ప్రమాదానికి ముందు పబ్‌లో మద్యం సేవించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాక సదరు మైనర్‌ తండ్రి.. తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన వెంటనే.. నిందితుడు తన కారులో ఇంటి నుంచి తప్పించుకుని వెళ్లాడు. పోలీసుల కళ్లు గప్పడం కోసం.. ముంబైకి వెళ్లాలని డ్రైవర్‌కు సూచించాడు. మరో డ్రైవర్‌కు కాల్‌ చేసి గోవా రమ్మని చెప్పాడు.

ఆ తర్వాత ముంబైకి వెళ్లే దారి మధ్యలోనే దిగిపోయి.. స్నేహితుడి కారులో ఛత్రపతి సాంబాజీ నగర్‌ వరకు వెళ్లాడు. అంతేకాక పోలీసులు తనను ట్రాక్‌ చేయకుండా ఉండటం కోసం.. పాత సిమ్‌ మార్చి.. కొత్తది తీసుకున్నాడు. కానీ సీసీ కెమరాల ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నారో పోలీసులు గుర్తించారు. ఓ లాడ్జ్‌లో దాక్కున్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. త్వరలోనే కోర్టు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇద్దరు ప్రాణాలు తీసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై విపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Show comments