విషాదకర న్యూస్ చదువుతూ.. లైవ్ లో పగలబడి నవ్విన యాంకర్..

లైవ్ న్యూస్ చదువుతూ ఓ యాంకర్ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. అందరు ఆమెపై మండిపడుతున్నారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు సంబవించాయి. భాగమతి నది ఉదృతంగా పొంగి పొర్లుతూ బీభత్సాన్ని సృష్టించింది. దీంతో అక్కడి ప్రజలు నిలువ నీడ లేకుండా అరిగోస పడుతున్నారు. తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక అల్లాడిపోతున్నారు. అయితే ఇదే విషయమై ఓ మీడియా ఛానల్ కు చెందిన లేడీ యాంకర్ అక్కడ చోటుచేసుకున్న భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కుమని నవ్వింది. యాంకర్ నవ్వులు చిందిస్తున్న ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

బీహార్ లో భాగమతి నది సృష్టించిన బీభత్సాన్ని గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను లైవ్ లో వివరిస్తున్న ఓ లేడీ యాంకర్ ఓ పదాన్ని సరిగా పలకలేక తప్పుగా పలికింది. తన తప్పుకు తానే నవ్వుకుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు యాంకర్ పై విరుచుకుపడుతున్నారు. ఓ పక్క జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే, అంతటి విషాద వార్తను చదువుతున్న నీకు నవ్వు ఎలా వస్తుందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. లైవ్ లో ఉన్నావన్న సంగతి మరిచి నవ్వుతున్నారేంటి అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ యాంకర్ ఉద్దేశ్యపూర్వకంగా నవ్వకపోయినప్పటికి, విషాదకర వార్తను చదువుతూ లైవ్ లో నవ్వడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఆ యాంకర్ తన తప్పును క్షమించాలని ప్రజలను కోరినట్లు తెలుస్తోంది.

Show comments