ప్రవళిక మరణం గురించి డీసీపీ సంచలన విషయాలు !

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు-2 పరీక్ష వాయిదా పడ్డం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోలేదని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవళిక మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని అన్నారు. ప్రవళిక కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేమ వ్యవహారమే కారణమన్నారు.

ఆమె 15 రోజుల కిందనే హాస్టల్‌లో చేరిందని తెలిపారు. ప్రవళిక శివరామ్‌ రాథోడ్‌ అనే వ్యక్తిని ప్రేమించిందని వెల్లడించారు. అయితే, శివరామ్‌ వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు తేలిందన్నారు. ప్రవళిక, శివరామ్‌ల ప్రేమ వ్యవహారం గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుసన్నారు. ప్రియుడు వేరే యువతితో పెళ్లికి సిద్ధపడటంతో ప్రవళిక తట్టుకోలేకపోయిందని అన్నారు. ఆమె చివరి సారిగా శివరామ్‌తోనే ఫోన్‌లో మాట్లాడిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను ల్యాబ్‌కు పంపామన్నారు. దర్యాప్తు ఓ కొలిక్కి వస్తే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రవళిక మరణానికి.. గ్రూపు-2 పరీక్షలకు అసలు సంబంధమే లేదన్నారు. వ్యక్తిగత అంశాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రవళిక మృతిపై అసత్యాలు ప్రచారం చేయొద్దని కోరారు. మరి, గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న డీసీపీ వెంకటేశ్వర్లు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments