తిరుమల కాలి నడక మార్గంలో ఎలుగుబంటి హల్చల్‌..

తిరుమల కాలి నడక మార్గంలో ఎలుగుబంటి హల్చల్‌..

తిరుపతిలో అడవి జంతువులు రోడ్ల మీదకు వచ్చి భక్తులను భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు ఈమధ్య కాలంలో బాగా పెరిగి పోతున్నాయి. ఇక రెండు రోజుల క్రితం తిరుమల కాలి నడక మార్గంలో ప్రయాణిస్తోన్న చిన్నారి లక్షిత మీద చిరుత దాడి చేసి.. హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాలి నడక మార్గంలో వచ్చే భక్తుల భద్రతకు సంబంధించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సోమవారం తిరుమల నడక దారిలో ఎలుగుబంటి కనిపించింది.

తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో.. రెండు వల మెట్టు దగ్గర ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఇప్పటికే చిరుత సంచారంతో.. భయభయంగా గడుపుతున్న భక్తులు.. తాజాగా ఎలుగు బంటిని చూసి.. భయంతో పరుగులు పెట్టారు. దాంతో అదిరిపడిన ఎలుగు బంటి.. అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. వరుసగా అడవి జంతువులు ఇలా రోడ్ల మీదకు వస్తుండటంతో.. భక్తులు భయపడుతున్నారు.

ఇక తిరుమల కాలినడక మార్గంలో అర్థరాత్రి ఓ చిరుత బోనులో చిక్కింది. చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని భావిస్తున్నారు. దాన్ని ఆల్రెడీ తిరుపతి జూకి తరలించారు. అక్కడ దానికి బ్లడ్ శాంపిల్ టెస్టులు చేసి.. చిన్నారిని చంపిన చిరుతపులి అదా, కాదా అన్నది తేల్చనున్నారు. ఇలాంటి సమయంలో మరో చిరుతపులి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

Show comments