iDreamPost

నీ ప్రేమ పాడుగాను.. ప్రేమికుడిపై పెట్రోలు పోసి.. తాను నిప్పంటించుకుని

  • Published May 11, 2024 | 11:25 AMUpdated May 11, 2024 | 2:08 PM

Tamil Nadu: ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ప్రేమికుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఓ యువతి. ఆ వివరాలు..

Tamil Nadu: ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ప్రేమికుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఓ యువతి. ఆ వివరాలు..

  • Published May 11, 2024 | 11:25 AMUpdated May 11, 2024 | 2:08 PM
నీ ప్రేమ పాడుగాను.. ప్రేమికుడిపై పెట్రోలు పోసి.. తాను నిప్పంటించుకుని

ప్రేమకు నిర్వచనం చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా భాష్యం చెబుతారు. ఎవరు ఎన్ని డెఫినేషన్లు చెప్పినా.. నిజమైన ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు.. తాము ప్రేమించిన వారి సంతోషాన్ని మాత్రమే కోరుతుంది. లవ్‌ చేసిన వారి సంతోషం కోసం తాము బాధను భరిస్తారు.. తప్ప ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టరు.. బాధ పెట్టరు. ఒకప్పటి ప్రేమలు ఇలానే ఉండేవి. మరి నేటి కాలంలో లవ్‌ అంటే.. అవసరాలు తీర్చుకునే సాధనంగా మారింది. ఇక ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. తనకు దక్కని ప్రేమ ఎవరికి దక్కకూడదని భావించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దాంతో దారుణాలకు పాల్పడుతున్నారు. కేవలం మగవారే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటు. యువతులు కూడా ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు. కుదరకపోతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

తాను ప్రేమించిన వాడు మరొకరికి దక్కకూడదనే భావంతో.. ఓ ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. లవర్‌ మీద పెట్రోల్‌పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఆమె కూడా నిప్పంటించుకోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలాడుదురై టౌన్‌స్టేషన్‌ దక్షిణ వీధికి చెందిన ఆకాష్‌(24) పూంపుహార్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సం చదువుతున్నాడు. చిదంబరం సమీప భవనగిరి కచ్చపిళ్లయార్‌ ఆలయం వీధికి చెందిన సింధూజ(22) మైలాడుదురైలోని మహిళ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. బస్సుల్లో వచ్చి వెళ్లే సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. బస్సు కోసం ఇద్దరు ఒకే బస్టాండ్‌కు వచ్చే వారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది.

ఇక కొద్దిరోజుల కిందట ఆకాష్‌ మైలాడుదురై బస్టాండులో మరో యువతితో మాట్లాడటాన్ని చూసిన సింధూజ జీర్ణించుకోలేకపోయింది. దీని గురించి అతడిని నిలదీసింది. కానీ ఆకాష్‌ సరిగా సమాధానం చెప్పకపోవడంతో సింధూజ అతడిపై అనుమానం పెంచుకుంది. ఆకాష్‌ తనకు దూరమవుతున్నాడని భావించింది. తాను ప్రేమించిన వారడు మరొకరికి దక్కకూడదనే ఉద్దేశంతో ఎలాగైనా అతడిని హత్య చేయాలనుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా.. గురువారం నాడు.. పూంపుహార్‌ వెళ్దామని ఆకాష్‌ను కోరింది సింధూజ. దాంతో ఇద్దరూ బైక్‌పై ప్రయాణం అయ్యారు.

అలా వెళ్లేటప్పుడే సింధూజ తన వెంట పెట్రోలు బాటిల్‌ తీసుకెళ్లింది. పూంపుహార్‌ చేరుకున్నాక.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సింధూజను మైలాడుదురై బస్టాండుకు తీసుకొచ్చి దించాడు ఆకాష్‌. అయితే హఠాత్తుగా అతడిపై పెట్రోలు పోసి నిప్పంటించింది సింధూజ. ఆతర్వాత ఆమె కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని బస్టాండులోకి పరుగులు తీసింది. ఇది గమనించిన ప్రయాణీకులు అడ్డుకుని మంటల ఆర్పారు. ఇక ఆకాష్‌ సమీపంలోని కావేరి నదిలోకి పరుగులు తీశాడు. అక్కడ నీరులేక పోవడంతో నేలపై దొర్లి మంటలు ఆర్పుకున్నాడు. ఈ ఘటనలో సింధూజ, ఆకాష్‌.. ఇద్దరూ తీవ్రంగా గాయపడగా వారిని తిరువారూర్‌ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మైలాడుదురై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి