ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్.. చంద్రబాబుతో గురువారం ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన పవన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అలాగే ఆయన మరికొన్ని కామెంట్స్ చేశారు. పవన్ వ్యాఖ్యల మీద ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి వెళ్తానంటున్న పవన్ దీని పర్యవసానం త్వరలోనే చూస్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. పొత్తు ప్రకటనతో పవన్ను ప్యాకేజీ స్టార్ అని చెబుతున్న విషయం మరోమారు నిరూపితమైందన్నారు. పవన్ను ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగా ప్రజల్లో, సమాజంలో ప్రచారం చేసింది చంద్రబాబు కాదా? అని మంత్రి కొట్టు ప్రశ్నించారు. పవన్ సొంత అన్నయ్య చిరంజీవితో పాటు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అవమానించింది బాబు కాదా? అని కొట్టు సత్యనారాయణ క్వశ్చన్ చేశారు.
టీడీపీతో కలసి ఎన్నికల్లో వెళ్లాలని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తోందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి జనసేన అధినేత కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ ఉంటే షూటింగ్లో.. లేకపోతే బాబు కాళ్ల దగ్గర ఉంటారని మంత్రి సత్యనారాయణ విమర్శించారు. ఆనందంగా ఉన్న ప్రజలు కష్టాలు పడాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.
ఇదీ చదవండి: ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన పవన్!