iDreamPost

బాలకృష్ణపై మంత్రి రోజా సీరియస్.. సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడంటూ..!

  • Author singhj Published - 03:24 PM, Thu - 21 September 23
  • Author singhj Published - 03:24 PM, Thu - 21 September 23
బాలకృష్ణపై మంత్రి రోజా సీరియస్.. సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడంటూ..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఐద్రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే సమావేశాల తొలి రోజే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సభను అడ్డుకున్న టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇదే టైమ్​లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు మీద స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే వైపు చూస్తూ సభలో ఉన్న బాలయ్య మీసం తిప్పారు. ఆయనకు దీటుగా మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఫైళ్లు విసిరేశారు.

టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ మీసం తిప్పి, తొడ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణకు దీటుగా వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ కొట్టిమరీ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. పబ్లిసిటీ కోసమే తెలుగుదేశం పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారని ఆమె అన్నారు. సభాపతి మీద ప్రతిపక్ష నేతలు ఫైల్స్ విసిరేసి, బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారని చెప్పారు. బాలకృష్ణ ప్రవర్తన సభా మర్యాదను అగౌరవపర్చేలా ఉందన్నారు రోజా.

టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు బాలకృష్ణపై మంత్రి ఆర్​కే రోజా సీరియస్ అయ్యారు. బావ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడని ఆమె అన్నారు. సభను ఆయన సినిమా షూటింగ్ అనుకుంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ అని మంత్రి రోజా విమర్శించారు. తొమ్మిదేళ్లలో బాలకృష్ణ ఎన్నిసార్లు సభకు వచ్చాడని ఆమె ప్రశ్నించారు. తనకు ఓటేసి గెలిపించిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఎప్పుడైనా బాలకృష్ణ మాట్లాడాడా? అని ఆమె క్వశ్చన్ చేశారు. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటకు తీస్తామని రోజా స్పష్టం చేశారు. దమ్ముంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై రావాలని సవాల్ విసిరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి