iDreamPost

హైకోర్టు జడ్జీల పదవీకాలం కూడా సురక్షితం కాదు ఎస్ఈసీ కేసులో వాదన

హైకోర్టు జడ్జీల పదవీకాలం కూడా సురక్షితం కాదు ఎస్ఈసీ కేసులో వాదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామక నిబంధనలు సడలించడంతో మొదలయిన వివాదం ఏపీ హైకోర్టులో కొనసాగుతోంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై పలువురు కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పిటీషనర్ల తరుపు వాదనలు ముగిసాయి. తాజాగా ప్రభుత్వం , ఎస్ఈసీ వాదనలు కూడా హైకోర్టు ముందుకొచ్చాయి. తీర్పుని మాత్రం రిజర్వ్ చేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ఆసక్తికర వాదన ముందుకొచ్చింది. ఏకంగా హైకోర్ట్ జడ్జీల పదవీకాలం కూడా సురక్షితం కాదంటూ ప్రస్తుతం ఎస్ఈసీగా ఉన్న రిటైర్డ్ జడ్జి వి కనగ రాజ్ ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్ట్ జడ్జీల పదవులకు కూడా గ్యారంటీ లేదన్నట్టుగా పేర్కొన్నారు. అదే రీతిలో ఆర్టికల్ 243 కే లో కూడా సర్వీస్ కండీషన్స్, పదవీకాలం వేరుగా ఉన్నందున ఈ విషయంలో స్పష్టంగా పేర్కొనలేదని వాదించారు.

ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం కుదించడం చట్టవిరుద్ధమనే వాదనలను డిఫెన్స్ న్యాయవాదులు చేయగా, రాజ్యాంగం ప్రకారం అది చెల్లదని రిటైర్డ్ జడ్జీగా ఉన్న కనగరాజ్ ప్రస్తావించడం విశేషంగా మారింది. అదే క్రమంలో నిబంధనల ప్రకారం హైకోర్ట్ జడ్జీలను కూడా తొలగించే అవకాశం ఉందనే రీతిలో వ్యాఖ్యలు చేయడం విశేషంగా మారింది. చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసులో తుది తీర్పు ప్రస్తుతానికి రిజర్వ్ చేసిన నేపథ్యంలో బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది. రాజకీయంగా ఇది కీలక తీర్పుగా అంతా పరిగణిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి