iDreamPost

భారీ ఆర్థిక ప్యాకేజీ పై నిర్మలమ్మ క్లారిటీ ఈరోజే..!

భారీ ఆర్థిక ప్యాకేజీ పై నిర్మలమ్మ క్లారిటీ ఈరోజే..!

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్ వల్ల దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఈ మొత్తం కూడా ఈ ఆర్థిక ఏడాదిలోనే ఇస్తామని చెప్పారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో ని కార్మికులు, ఉద్యోగుల తో సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ ఆర్థిక ప్యాకేజి ద్వారా మేలు కలుగుతుందని, తద్వారా దేశ వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని మోదీ అభిలషించారు.

20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఎలా ఉండబోతుంది. ఏ విధంగా ఇవ్వబోతున్నారు. ఏ ఏ రంగాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి. ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తారా..లేదా కంపెనీ లకు రాయితీలు ఇస్తారా.. అన్న అంశాలపై నిన్నటి నుంచి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్యాకేజీపై ఎవరికి వారు లెక్కలు, అంచనాలు వేసుకుంటూ ఊహల్లో తేలుతున్నారు. ప్రజల అంచనాలకు ఊహలకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తెర పడబోతోంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కి సంబంధించిన వివరాలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించనున్నారు. దీంతో నిర్మల సీతారామన్ ఏం ప్రకటించబోతున్నారన్న దానిపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి