iDreamPost

జగన్‌ పరిపాలనకు గుర్తింపు..! రివార్డు ప్రకటించిన కేంద్రం

జగన్‌ పరిపాలనకు గుర్తింపు..! రివార్డు ప్రకటించిన కేంద్రం

పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన, సులభతరమైన సేవలు అందింస్తున్నారంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు రాగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి రివార్డు కూడా ప్రకటించింది. పౌరసేవల సంస్కరణలను ఉన్నతంగా అమలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు 1004 కోట్ల రూపాయలను రివార్డుగా ప్రకటించింది. ఇందులో ఏపీ వాటాగా 344 కోట్ల రూపాయలు లభించాయి.

వన్‌నేషన్‌ వన్‌ రేషన్‌కార్డు, ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, పట్టణ, స్థానిక సంస్థల పరిపాలనలలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసినందుకుగాను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రివార్డు ప్రకటించింది. రేషన్‌కార్డు మంజూరు, రేషన్‌ పంపిణీలో సీఎం జగన్‌ విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఫలితంగా సులువుగా రేషన్‌కార్డు పొందడం, రేషన్‌ ఎక్కడ నుంచైనా తీసుకునే వెలుసుబాటు ప్రజలకు కలిగింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తెచ్చారు. వాలంటీర్ల ద్వారా సేవలను ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలోనూ సరళతరమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. జగన్‌ పాలనను మెచ్చుకుంటూ..నగదు రివార్డును కేంద్ర ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. కుల, మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం వివక్ష చూపుతుందనే విమర్శలు చేస్తున్నాయి. ఇందులో ఏపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ పాలనకు వచ్చిన గుర్తింపు సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టులా మారాయని చెప్పవచ్చు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలకు ఈ అంశం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి