iDreamPost

ఆ విలన్లు వద్దంటున్న అభిమానులు

ఆ విలన్లు వద్దంటున్న అభిమానులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. రశ్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే హౌస్ అరెస్ట్ లోనే ట్యూన్స్ కంపోజింగ్ మొదలుపెట్టేశాడు. నిత్యం హీరో, దర్శకుడితో వీడియో ఛాట్ ద్వారా అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడట. ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించడం ఇప్పటికే బజ్ ని పెంచేసింది.

ఇదిలా ఉండగా పుష్పలో చాలా పవర్ ఫుల్ గా విలన్ పాత్రకు సుకుమార్ బాలీవుడ్ పేర్లను పరిశీలిస్తున్నాడన్న వార్తలు అభిమానులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. వాటిలో ముందు వరసలో జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి ఉన్నారట. వీళ్ళు అయితే ఖంగారెందుకు అనే అనుమానం వస్తుంది కదా. కారణం ఉంది.

జాకీ ష్రాఫ్ ఎప్పటి నుంచో తెలుగులో భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ శక్తి నుంచి ప్రభాస్ సాహో దాకా ఏదీ కనీసం యావరేజ్ ఫలితాన్ని కూడా ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే హీరోల ఫ్యాన్స్ ఐరన్ లెగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక సునీల్ శెట్టి లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సుదీప్ పెహల్వన్ తో పాటు రజనికాంత్ దర్బార్ లో ముఖ్యమైన పాత్రలే చేశాడు.

రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర పేలిపోయాయి. అందులోనూ ఇతనిది రఫ్ ఫేస్. రాని బాష కాబట్టి ఎక్స్ ప్రెషన్లు రాబట్టుకోవడం చాలా కష్టం. హిందిలో కండల వీరుడే కాని ఇక్కడ మాత్రం అంతగా కనెక్ట్ అవ్వడు. అందుకే వీళ్ళు వద్దని బన్నీ ఫాలోయర్స్ కోరుకోవడంలో అసహజం ఏమి లేదు. సంజయ్ దత్ ని ట్రై చేస్తున్నారట కాని అంత ఈజీగా ఒప్పించే అవకాశాలు లేవట. అప్పుడెప్పుడో నాగార్జున చంద్రలేఖలో ఓ సీన్ లో తళుక్కున కనిపించి మాయమవడం తప్ప ఆయన తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇప్పటిదాకా చేయలేదు. మరి సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. కరోనా టెన్షన్ తగ్గిపోయాక హైదరాబాద్ శివార్లలోనే పుష్ప షూటింగ్ నిరవధికంగా జరిగేలా ప్లానింగ్ చేసింది మైత్రి సంస్థ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి