iDreamPost

ఈ సారి పీకే ఏమి చేయబోతున్నాడు..?

ఈ సారి పీకే ఏమి చేయబోతున్నాడు..?

పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలో ఏర్పాటు చేయనున్న ‘ఎంపవర్డ్ కాంగ్రెస్ కమిటీ’లో చేరమని కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్‌కు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను పీకే తిరస్కరించాడు. గతంలో కూడా పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే, ఆ సమయంలో పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు. తాజాగా పీకే ప్రతిపాదనల నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, చివరకు పీకే కాంగ్రెస్‌లో చేరకుండానే వెనుదిరిగారు.

ఈ విషయంలో అటు రాహుల్ గాంధీకి, ఇటు పీకేకు మధ్య అనేక అనుమానాలు, సందేహాలు నెలకొనడం కూడా పీకే నిర్ణయానికి ఒక కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా పీకే చేరికను అనుమానించారు. పీకే, కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని, ఇతర పార్టీలకు లబ్ధి చేకూరేలా చేస్తాడని పార్టీ సీనియర్ నేతలు భావించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడికి లేదా ఉపాధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి పదవిని పీకే ఆశించాడని చెబుతున్నారు. ఆయన కోరుకున్న పదవికి కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో, పార్టీలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

గత ఏడాది పీకే కాంగ్రెస్‌లో చేరే అంశం మధ్యలోనే ఆగిపోయిన తర్వాత.. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు, పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని జాతీయపార్టీగా తీర్చిదిద్దేందుకు, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించేందుకు పీకే పనిచేశారు. తృణమూల్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించిపెట్టిన తర్వాత.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పీకే ఈ తరహా రాజకీయాలకు తెరతీశారు. ఫలితంగా మిజోరం,గోవా సహా పలురాష్ట్రాలలో కాంగ్రెస్‌ నేతలు తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరి ఈ సారి కూడా పీకే కాంగ్రెస్‌లో చేరే ప్రతిపాదనలు ఎప్పటి మాదిరిగానే విఫలం కావడంతో.. తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి