iDreamPost

పేదలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ!

  • Published Jul 20, 2023 | 11:43 AMUpdated Jul 20, 2023 | 11:43 AM
  • Published Jul 20, 2023 | 11:43 AMUpdated Jul 20, 2023 | 11:43 AM
పేదలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ!

మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే టార్గెట్‌గా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పని చేస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రభుత్వ పథకాల అమలును స్పీడ్‌ చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు పట్టాల పంపిణీ, చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం, రైతు బంధు, దళితబంధు వంటి పథకాల అమలు స్పీడు పెంచుతోంది. వీటితో పాటు మరో ముఖ్యమైన హామీకి సంబంధించిన కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల్లో కీలకమైనది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ. మిగతా అన్ని హామీలను నెరవేర్చినప్పటికి.. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ అనేది అంత వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే హైదరాబాద్‌ నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.

నగరంలో.. ఆగస్టు మెుదటి వారం నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తామని.. అక్టోబర్‌ మూడవ వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అత్యంత పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలని కేటీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్‌ వెల్లడించారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి.. రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. కేటీఆర్‌ ప్రకటించిన లక్ష ఇండ్లలో ఇప్పటికే 65 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఆరు దశల్లో ఈ ఇళ్లను పేదలకు అందజేయనున్నారు. వీటితోపాటు తుది దశలో ఉన్న ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉందని మునిస్పల్ శాఖ అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి