iDreamPost
android-app
ios-app

కుమార్తె దారుణం.. గాజు పెంకుతో తండ్రి గొంతు కోసి..

కుమార్తె దారుణం.. గాజు పెంకుతో తండ్రి గొంతు కోసి..

పిల్లలను తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. అదే పుట్టింది ఆడపిల్ల అయితే ఆ తండ్రి సంతోషానికి అవధులు ఉండవు. ఆ తండ్రికి ఈ ప్రపంచంలో కెల్లా కుమార్తె కంటే ఎక్కువ ఎవరూ కాదు. కాలు కింద పెట్టకుండా కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తల్లి నవమాసాలు మోసి కంటే.. ఆ తండ్రి జీవితాంతం ఆ కుమార్తెను గుండెల్లో పెట్టుకుని మోస్తుంటాడు. ఆమె నోరు తెరిచి అడగక ముందే కావాల్సినవి అన్ని కొనిస్తాడు. తనను బాగా చదివించి.. ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అని కలలు కంటాడు. కుమార్తె జీవితంలో ఏదైనా సాధిస్తే.. అది తన విజయం అన్నంతలా తండ్రి ఆనంద పడతాడు. అలాంటి ఒక తండ్రిని ఓ కసాయి కూతురు అతి దారుణంగా గాజు పెంకుతో గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం మరెక్కడో కాదు.. హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్ కుటుంబం అంబర్ పేట్ లోని తులసీరామ్ నగర్ లో నివాసముంటోంది. జగదీశ్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె నిఖత పండ్ల దుకాణంలో పని చేస్తోంది. ఏదో సందర్భంలో జగదీశ్ తన కుమార్తెను తిట్టాడు. జగదీశ్ అన్న మాటలను నిఖిత మనసులో పెట్టుకుంది. తిట్టింది తండ్రే కదా అని ఊరుకోలేదు. తండ్రిపై పగ పెంచుకుంది. ఏకంగా అతడిని అంతం చేయాలి అనుకుంది. విచక్షణ మరిచిన నిఖిత.. గాజు పెంకు తీసుకుని అతి కిరాతకంగా తండ్రి గొంతు కోసింది. జగదీశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న జగదీశ్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల వల్ల జగదీశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు నిఖతను అదుపులోకి తీసుకుని.. రిమాండుకు తరలించారు. కేవలం తిట్టడం మాత్రమే కాకుండా.. జగదీశ్ ను హత్య చేసేందుకు మరో కారణం ఉందంటూ తెలుస్తోంది. నిఖత రోజూ మద్యం తాగుతోందని తండ్రి మందలించాడంట. ఆమెను మద్యం తాగొద్దు అన్నందుకే గాజు పెంకుతో తండ్రి గొంతు కోసి హత్య చేసినట్లు చెబుతున్నారు. అయితే హత్యకు గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కన్న తండ్రిని అంత కిరాతకంగా హత్య చేసిందని తెలుసుకుని కంగారు పడ్డారు.