SNP
SNP
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ జోష్ వచ్చింది. అక్కడి విజయం తాలుకు ప్రభావం తెలంగాణ కాంగ్రెస్పై పడింది. దాంతో పాటు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులు కాంగ్రెస్లో చేరడం, ఖమ్మంలో పెట్టిన జనగర్జన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిపడింది.
ఈ క్రమంలో కొన్ని నెలలుగా తెలంగాణలో బీఆర్ఎస్కు చెమటలు పట్టించిన బీజేపీ సైడ్ జరిగింది. అందుకు వాళ్ల పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు కారణం కావచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఖాయంగా కనిపిస్తోందని రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్లిన కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బీజేపీలో పెనుదుమారమే రేపింది. వెంటనే అలెర్ట్ అయిన బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించో, మందలించో తాత్కాలికంగా ఆపినట్లు ఉన్నారు.
కానీ, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, తనకు కీలక పదవి ఏదీ ఇవ్వకపోవడంతో రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీ మారే ఆలోచనను దారిలో పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడంతో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్లో చేరేందుకు పొంగులేటితో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అదే నిజమైతే తెలంగాణలో బీజేపీకి పెద్ద షాక్ తగిలినట్లే. రాజగోపాల్ రెడ్డి బాటలోనే మరికొంతమంది నాయకులు నడిచే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం బీజేపీ అధిష్టానం, రాష్ట్ర పెద్దలపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పొంగులేటితో భేటీ కావడంపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి వీరి భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.