iDreamPost
android-app
ios-app

జైశ్వాల్ ఆటను దేశం మొత్తం చూసింది.. అతని కుటుంబం తప్ప..!

జైశ్వాల్ ఆటను దేశం మొత్తం చూసింది.. అతని కుటుంబం తప్ప..!

యశస్వీ జైశ్వాల్.. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా క్రికెట్ ప్రపంచంలో కూడా ఈ పేరు పెను సంచలనంగా మారింది. తన టెస్టు డెబ్యూ మ్యాచ్ లోనే 171 పరుగులతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒక్క మ్యాచ్ తోనే ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. టీమిండియాలో శిఖర్ ధావన్, పృథ్వీ షా తర్వాత తొలి మ్యాచ్ లోనే శతకం సాధించిన ఓపెనర్ గా నిలిచాడు. పిన్న వయసులో డెబ్యూ మ్యాచ్ లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా.. విదేశాల్లో తొలి టెస్టు మ్యాచ్ లో సెంచరీ చేసిన 5వ ప్లేయర్ గా రికార్డుల మోత మోగించాడు.

అంతేకాకుండా టీమిండియా టెస్టు హిస్టరీలోనే వెస్టిండిస్ గడ్డపై అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా యశస్వీ జైశ్వాల్ రికార్డు సృష్టించాడు. ఒక్క ఇన్నింగ్స్ తోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. ఇంతటి స్పెషల్ మ్యాచ్ ని అతని కుటుంబం మాత్రం చూడలేదు అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటి దేశం మొత్తం జైశ్వాల్ వీరోచిత ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చేస్తే.. సొంత కుటుంబం ఎందుకు చూడలేదు అనుకుంటున్నారా? అందుకు కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.

యశస్వీ జైశ్వాల్ తండ్రి కన్వార్ యాత్రలో ఉన్నారు. ఆయన ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కు కాలినడకన వెళ్తున్నారు. జైశ్వాల్ తొలి టెస్టు మ్యాచ్ ను ఆయన తన ఫోన్ లో ఫాలో అవుతూ పాదయాత్ర కొనసాగించారు. తన కుమారుడు మంచిగా ఆడాలంటూ ఆయన ప్రార్థనలు కూడా చేశారు. అయితే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఎంతో బిజీగా ఉన్నారు. జైశ్వాల్ ఆట చూడకుండా వాళ్లకి అంత బిజీ పనులు ఏమున్నాయి అనుకుంటున్నారా? అవి జైశ్వాల్ అప్పజెప్పిన పనులే అంటలెండి. యశస్వీ జైశ్వాల్ కుటుంబం తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇల్లు షిఫ్టింగ్ పెట్టుకున్నారు. తమ డబుల్ బెడ్ రూమ్ అద్దె ఇంటి నుంచి తమ సొంత 5 బెడ్ రూమ్స్ కలిగిన లగ్జరీ అపార్టుమెంటుకు మారారు.

ఈ విషయంపై కుటుంబం మాట్లాడుతూ.. “త్వరగా ఇల్లు మారదాం అని జైశ్వాల్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. తనకు ఆ ఇంట్లో ఉండాలని లేదని చాలాసార్లు అన్నాడు. తన సొంత ఇంట్లో ఉండాలి అనేది జైశ్వాల్ కల. టెస్టు మ్యాచ్ సమయంలో కూడా ఇంటి షిఫ్టింగ్ అయిందా.. త్వరగా మారండి అని చెబుతూనే ఉన్నాడు. తన జీవితంలో తనకి ఒకే ఒక కల ఉండేది. తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని. ముంబాయిలాంటి ఒక నగరంలో సొంత ఇల్లు ఉండటం ఎంత ముఖ్యం అనేది జైశ్వాల్ కు బాగా తెలుసు” అంటూ అతని సోదరుడు తేజశ్వీ చెప్పాడు.

జైశ్వాల్ మాట్లాడుతూ.. “ప్రిపరేషన్ చాలా బాగా సాగుతోంది. రాహుల్ ద్రావిడ్ గారితో చాలా విషయాలు మాట్లాడాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలక్టర్స్, రోహిత్ శర్మ భాయ్ కి ధన్యవాదాలు. టీమిండియా టెస్టు క్రికెట్ లో భాగం కావాలి అనేది నా కల మాత్రమే కాదు.. నా లక్ష్యం కూడా. ఇది కేవలం ఆరంభం మాత్రమనే అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా దూరం వెళ్లాలి. నా ఈ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లతో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంది. వారి నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి” అంటూ జైశ్వాల్ వ్యాఖ్యానించాడు.