ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఈ రెండు టోర్నీలతో భారత జట్టులో ఫుల్ జోష్ వచ్చింది. ఈ టోర్నీలకు ముందు వరకు టీమ్ విషయంలో కొన్ని సందేహాలు ఉండేవి. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా ఏ విధంగా కమ్బ్యాక్ ఇస్తారు? వాళ్లు ఫిట్గా ఉన్నారా? మన స్పిన్ బలం సరిపోతుందా? లాంటి డౌట్స్ ఉండేవి. కానీ వీటికి ఆన్సర్స్ దొరికేశాయి. ఆసియా కప్, ఆసీస్తో సిరీస్లో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ తమ ఫామ్ను చాటుకున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఫుల్ స్వింగ్లోకి వచ్చేశాడు. రాహుల్, అయ్యర్ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేలకు తాను పనికొస్తానని నిరూపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటారు. వరల్డ్ కప్కు ముందు కరెక్ట్ టైమ్లో అందరూ గాడిన పడ్డారు. అయితే ఇప్పటికీ జట్టు కూర్పు విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఆ ప్లేస్ కోసం అయ్యర్, సూర్య పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఫామ్లో ఉన్నారు. స్పిన్ బౌలింగ్లో బాగా ఆడటం అయ్యర్ బలమైతే.. పేస్ అటాక్ను చిత్తు చేయడం సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. టీమిండియాలో నంబర్ 4లో ఎవరు ఆడతారనే దానిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రాణించినప్పటికీ భారత తుది జట్టులో సూర్యకుమార్కు ప్లేస్ దక్కడం కష్టమేనని ఒక స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ చెప్పాడు. ‘వన్డే క్రికెట్లో సూర్య ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఆఖరి 15 నుంచి 20 ఓవర్లలో మాత్రమే అతడు బ్యాటింగ్ చేయగలడు. ఆ టైమ్లో టీ20 ఫార్మాట్ మాదిరిగా ఆడతాడు. పొట్టి ఫార్మాట్లో సూర్య అద్భుతమైన ప్లేయర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ హార్దిక్, ఇషాన్, రాహుల్ కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా రాణించగలరు. కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్లో సూర్యకు చోటు కష్టమే. నాలుగో నంబర్లో అయ్యర్ అదరగొడుతున్నాడు. ఒకవేళ సూర్యకు ఆ ప్లేస్లో ఛాన్స్ ఇస్తే అతడు భారీ సెంచరీ కొట్టి తనను తాను నిరూపించుకోవాలి. అప్పుడే అతడిపై టీమ్ మేనేజ్మెంట్ కూడా నమ్మకం ఉంచుతుంది’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: పాక్ నెట్ బౌలర్గా హైదరాబాద్ కుర్రాడు!