iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తున్నారు.. ఇక వీళ్ల ప్లేస్ గల్లంతే!

  • Author singhj Published - 01:24 PM, Tue - 26 September 23
  • Author singhj Published - 01:24 PM, Tue - 26 September 23
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తున్నారు.. ఇక వీళ్ల ప్లేస్ గల్లంతే!

భారత జట్టు వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉంది. టీమిండియాకు అసలు ఎదురే లేకుండా పోతోంది. ఆసియా కప్​లో ఎదురొచ్చిన ప్రత్యర్థులను ఓడిస్తూ పోయిన భారత జట్టు.. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్​లోనూ టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. కంగారూలతో జరిగిన తొలి రెండు వన్డేల్లో సునాయాసంగా గెలిచి, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్​లో నామమాత్రంగా చెప్పుకునే మూడో వన్డేలో మాత్రం రెండు టీమ్స్ ఫుల్ స్ట్రెంగ్త్​తో బరిలోకి దిగుతున్నాయి.

తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలు చివరి వన్డేకు అందుబాటులో ఉంటారు. దీంతో రాజ్​కోట్ వన్డేలో పలువురు ప్లేయర్లు బెంచ్​కే పరిమితం కానున్నారు. రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన శుబ్​మన్​ గిల్​తో పాటు ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​ను విశ్రాంతినిచ్చే అవకాశముంది. కీపర్ ఇషాన్ కిషన్​కు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రెండు వన్డేల్లో ఓపెనర్​గా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం లేదు. ఆసియా క్రీడల కోసం అతడు హాంగ్​జౌకు వెళ్తున్నాడు. ఆ క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్​ జట్టుకు రుతురాజ్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఆసియా కప్​లో గాయపడిన ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ ఆసీస్​తో ఆఖరి వన్డేకు అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నారు. అతడు గ్రౌండ్​లోకి దిగుతాడని భావించారు. కానీ మూడో వన్డేకు అక్షర్ దూరమయ్యాడు. గాయం బారి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్​లో అతడు ఆడట్లేదు. అయితే వరల్డ్ కప్​కు కూడా అక్షర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ లోపు ప్రపంచ కప్ జట్టులో మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అంతలోపు అక్షర్ ఫిట్​నెస్ సాధించకపోతే అతడి ప్లేసులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీకి మార్గం సుగమమవుతుంది. మరో ప్రత్యామ్నాయంగా వాషింగ్టన్ సుందర్ కనిపిస్తున్నా.. మంచి అనుభం ఉన్న అశ్విన్ ఈ రేసులో ముందున్నాడు.