P Venkatesh
P Venkatesh
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో.. రిజర్వ్ డే ఉండటంతో సోమవారం మ్యాచ్ను కొనసాగించారు. మొత్తానికి మ్యాచ్ పూర్తిగా జరిగి.. టీమిండియా విజయం సాధించింది. అయితే.. ఆది, సోమవారం మ్యాచ్ ఆడిన టీమిండియా.. మంగళవారం మళ్లీ శ్రీలంకతో కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంది. మూడు గంటల్లో ముగిసే టీ20 మ్యాచ్లనే ఆటగాళ్లు వరుసగా ఆడలేరు. అలాంటిది టీమిండియా ఆటగాళ్లు వన్డేలు వరుసగా ఆడాల్సి వస్తుంది.
ఇలా వరుస వన్డేలతో టీమిండియా ఆటగాళ్లు అలసిపోయి, గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన టోర్నీకి ముందు ఇలా వరుస వన్డేలు ఆడటం ఏంటని క్రికెట్ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్లు సరిగా అనుకున్న సమయానికి జరగకపోవడం, ఇండియా-పాక్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించడంతోనే ఇలా వరుస మ్యాచ్లు వచ్చాయి. అయితే.. ఇదంతా.. బీసీసీఐ తీసుకున్న చెత్త నిర్ణయాలతో జరుగుతున్నాయని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
నిజానికి ఈ ఆసియా కప్ పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. కానీ, టీమిండియాను పాక్కు పంపడం సరికాదని భారత ప్రభుత్వం సూచించడంతో.. బీసీసీఐ టీమిండియాను పాక్కు పంపలేదు. టీమిండియా లేకుండా ఆసియా కప్ జరిగితే.. దానికి ఆదరణ ఉండదని, పాకిస్థాన్ ఒక మెట్టు కిందకి దిగింది. ఏసీసీ ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి ఉన్న జైషా.. ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా జైషా బలవంతంగా ఆసియా కప్ను హైబ్రిడ్ మోడల్లో కొన్ని మ్యాచ్లు పాకిస్థాన్లో, కొన్ని శ్రీలంకలో నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. శ్రీలంకలో వర్షాలు వస్తున్నాయని తెలిసినా కూడా అక్కడే మ్యాచ్లు పెట్టారని, యూఏఈలో నిర్వహించాలని సూచించినా కూడా వినలేదని పీసీబీ పలుమార్లు వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల.. వరల్డ్ కప్ ముందు టీమిండియా సరైన ప్రాక్టీస్ లభించకపోగా.. వరుస మ్యాచ్లు ఇబ్బంది పెడుతున్నాయి.
వర్షాల వల్ల చిత్తడిగా ఉన్న మైదానాల్లో ఆటగాళ్లు జారిపడి గాయాల పాలయ్యే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో చీటికి మాటికి గాయాల పాలయ్యే మన టీమిండియా ఆటగాళ్లకు అయితే ఇబ్బంది మరీ ఎక్కువ. పాకిస్థాన్కు వెళ్లడం ఇష్టం లేకుంటే.. యూఏఈలో మ్యాచ్ నిర్వహించి ఉంటే.. టీమిండియా అన్ని మ్యాచ్ పూర్తి స్థాయిలో ఆడి, సరైన విధంగా రెస్ట్ తీసుకుని వరల్డ్ కప్కు బాగా ప్రిపేర్ అయ్యేది. ఇప్పుడిప్పుడే టీమిండియాలోని ఆటగాళ్లంతా ఫామ్లోకి వస్తున్నారు. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అద్భుత టచ్లో కనిపిస్తున్నారు. ఇలా కోర్ టీమ్ అంతా సెట్ అవుతున్న టైమ్లో.. ఇలా వరుస మ్యాచ్లు ఆడి, వర్క్లోడ్ వల్ల గాయాల పాలైతే.. వరల్డ్ కప్ ముందు టీమిండియా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అలా ఏమైనా జరిగితే.. కచ్చితంగా బీసీసీఐ తప్పే అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.