iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని CM KCR ఆదేశం

బ్రేకింగ్: రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని CM KCR ఆదేశం

తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబరు 2వ వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం విషయంలో మాత్రం.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటామని స్పష్టం చేశారు. రైతురుణమాఫీ ప్రక్రియ ఆలస్యం కావడానికి కేంద్రం కూడా కారణం అంటూ సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల పనులు ఆలస్యమయ్యాయి అన్నారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు కూడా ఈ మందగమనానికి కారణంగా చెప్పారు.

అంతేకాకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరించిన కక్షపూరిత చర్యలు కూడా కారణంగా చెప్పారు. ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించారంటూ విమర్శించారు. ఆ కారణాల రీత్యా ఏర్పడిన ఆర్థికలోటుతో ఇన్నాళ్లు రుణమాఫీ కాస్త ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే వస్తోంది. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3న పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ సెప్టెంబర్ రెండో వారం కల్లా రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోందని తెలిసి ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.