iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమం.. విజయమ్మ ప్రత్యేక ఆహ్వానాలు

వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమం.. విజయమ్మ ప్రత్యేక ఆహ్వానాలు

దివంగత ముఖ్యమంత్రి, వివిధ సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరమపదించి వచ్చే నెల 2వ తేదీకి పుష్కర కాలం గడుస్తోంది. సెప్టెంబర్‌ 2వ తేదీన ఆయన వర్థంతిని కుటుంబ సభ్యులు మునుపటికన్నా ప్రత్యేకంగా నిర్వహించేందుకు తలపెట్టారు. హైదరాబాద్‌లోని తమ నివాసంలో వైఎస్సార్‌ వర్థంతిని నిర్వహించేందుకు ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌తో పని చేసిన నేతలను, ఆయన కేబినెట్‌లో పని చేసిన మంత్రులను, ఆయన సన్నిహితులను విజయమ్మ ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటికే వెఎస్‌ కేబినెట్‌లో పని చేసిన మంత్రులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. వారితోపాటు వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, కేవీపీ రామచంద్రరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఉమ్మడి ఏపీ శాసన సభ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి తదితరులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా, రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుని రాష్ట్రం విడిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలో కొత్త వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్, వైసీపీలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైంది. కాంగ్రెస్‌ పార్టీలో పని చేసిన వారిలో చాలా మంది తమ దారి తాము చూసుకున్నారు. వైఎస్‌ కేబినెట్‌లో పని చేసిన మంత్రులు ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలలో ఉన్నారు. మరికొంత మంది కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ – పార్లమెంట్ సాక్షిగా నిర్ధారణ