iDreamPost
android-app
ios-app

రేవంత్ మంత్రాంగం : ఈటల కాంగ్రెస్ లోకి వెళ్తారా..?

రేవంత్ మంత్రాంగం : ఈటల  కాంగ్రెస్ లోకి వెళ్తారా..?

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌థ తెలంగాణ రాజకీయాల్లో రోజూ న‌డుస్తూనే ఉంటోంది. నిత్యం ఏదో టాపిక్ పై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఇప్ప‌టికీ టీఆర్ఎస్ కు రాజీనామా చేయ‌కుండా, మ‌రో పార్టీలోకి వెళ్ల‌కుండా, సొంత పార్టీపై ఎటువంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌కుండా వ‌రుస‌గా భేటీల‌తో నిమ‌గ్న‌మైన రాజేంద‌ర్ వ్య‌వ‌హారం అంతుచిక్క‌కుండా ఉంది. మ‌రోవైపు టీఆర్ఎస్ మాత్రం ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎక్క‌డిక‌క్క‌డ ప‌ట్టు బిగిస్తోంది.

ఇదిలాఉండ‌గా తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నార‌న్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆయ‌న భేటీ అయిన నాయ‌కుల్లో అన్ని పార్టీల‌కు చెందిన వారూ ఉన్నారు. అలాగే, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన‌ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీచైర్మన్ ఉమ నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా ఉన్నారు. దీంతో.. కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ జరిగింది. అనూహ్యంగా ఆయ‌న ఢిల్లీ వెళ్తున్నార‌నే వార్త‌లు కొత్త చ‌ర్చ‌కు దారి తీశాయి.

హుజూరాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ చేస్తున్న రాజ‌కీయాలకు చెక్ పెట్టేందుకు అన్న‌ట్లుగా ఇటీవలే ఈటల వర్గం ఓ పాటను రిలీజ్ చేసింది. అది నేరుగా టీఆర్ఎస్ మీద దాడిచేసినట్టుగానే అర్థమవుతోంది. ‘‘యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేతలరా.. సిద్ధమయ్యి ఒక ఆత్మగౌరవ పోరు సల్పుదామా. ఈటల రాజన్నతో ఇక జెండలెత్తుదామా.. దగాకోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా’’ అంటూ పాట కూడా రావడంతో యుద్ధం ఖాయమని అనుకున్నారు. కానీ.. ప్రకటన ఏదీ రాలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీ పెద్దలను కలిసి మంతనాలు జరిపారు. దీంతో.. ఆయా పార్టీల్లోకి వెళ్తారని కొందరు అంటే.. రాజీనామా తర్వాత వచ్చే ఉప ఎన్నికలో మద్దతు కోసం వెళ్లారని మరికొందరు అన్నారు. ఈ ప్రయత్నాలు ఇటు సాగుతుండగానే.. మరోవైపు టీఆర్ఎస్ తో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈటల ఢిల్లీ వెళ్తున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. సోనియా రాహుల్ గాంధీలను కలవనున్నారని ఈ మేరకు అపాయింట్ మెంట్ కూడా సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెండ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని అంటున్నారు. దీంతో.. ఈ మీటింగ్ వెనక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లడానికి చూస్తున్నారా? ఉప ఎన్నిక మద్దతు కోరడానికా? అనే చర్చ సాగుతోంది. మరి ఇందులో ఏది నిజం అనేది చూడాల్సి ఉంది.