iDreamPost
android-app
ios-app

కేంద్రం మొండిచేయి చూపితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేంటి అచ్చెన్నా?

  • Published Feb 02, 2022 | 2:48 AM Updated Updated Feb 02, 2022 | 2:48 AM
కేంద్రం మొండిచేయి చూపితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేంటి అచ్చెన్నా?

తన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నిరాశ పరిచిన కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ధైర్యం లేని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ అందరినీ ఆశ్చర్య పరిచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏం సాధించిందని ఆయన ఒక వింత ప్రశ్నను సంధించారు.

బాబు కూడా ధైర్యం చేయలేదు!

కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయలేదు. కేవలం నిరాశాజనకంగా ఉందని ఒక్క మాట అని ఊరుకున్నారు. బడ్జెట్‌లో ఏపీ ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైఎస్సార్‌ సీపీ విఫలమైందని, 28 మంది ఎంపీలుండి వైఎస్సార్‌ సీపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. అచ్చెన్న కూడా అదే బాటలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేశారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీల చేతకానితనంతోనే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపారన్నారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అచ్చెన్న విమర్శించారు.

Also Read : కేంద్ర బడ్జెట్ పై ఎందుకు అసంతృప్తి, ఏపీ ఆర్థికమంత్రి ఏమన్నారో తెలుసా

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది ఎవరు?

అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ నాయకులకు లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు దుయ్యబడుతున్నారు. పోలవరం కాంట్రాక్టును తమ పార్టీ ఎంపీకి కట్టబెట్టడం కోసం ప్రత్యేక హాదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం నుంచి టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. కేంద్రం చెప్పినట్టు ప్రత్యేక ప్యాకేజీకి తలాడించి.. ప్రత్యేక హాదాకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడి టీడీపీ నేతలు బాగుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీయే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన సంగతి మరచిపోయారా అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీల చేతకానితనం అంటూ విమర్శలు చేస్తున్న అచ్చెన్న.. కేంద్ర మంత్రి వర్గంలో నాలుగేళ్లపాటు టీడీపీ కొనసాగినప్పుడు రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు.

కేసుల నుంచి విముక్తి కోసం నాటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని చీకట్లో కలిసిన చరిత్ర చంద్రబాబుదని వైఎస్సార్‌ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేసుల మాఫీ కోసమే చంద్రబాబునాయుడు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపేశారన్న సంగతి అందరికీ తెలుసునని, వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం చంద్రబాబుకు తెలిసిన విద్య అని వైఎస్సార్‌ సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పుడు కూడా బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు ఆర్థిక నేరాల చిట్టా బీజేపీ ప్రభుత్వం బయటపెడుతుందని భయపడుతున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గురివింద గింజ సామెతను తలపిస్తూ అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన టీడీపీ మా ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమిటని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read : బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. ఆ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి రెడ్డి