iDreamPost
android-app
ios-app

క‌మ‌ల్ మ‌రీ అంత త‌ప్పు ఏం చేశారు..?

క‌మ‌ల్ మ‌రీ అంత త‌ప్పు ఏం చేశారు..?

గెలిచిన వారికి గొడుగు ప‌ట్టడం.. ఓడిన వారిని తిట్ట‌డం రాజ‌కీయాల్లో మామూలే. అయితే, క‌మ‌ల్ హాస‌న్ వంటి తిరుగులేని న‌టుడికి ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితులు వ‌రుస‌గా ఎదుర‌వుతుండ‌డం తీవ్ర దుమారం రేపుతుంది. సినిమాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకుని లోక్ నాయ‌కుడిగా పేరు పొందిన క‌మ‌ల్ రాజ‌కీయాల్లో క‌నీసం స్థానిక నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొంద‌లేక‌పోయారు. పార్టీ గెల‌వ‌క‌పోవ‌డాన్ని ప‌క్క‌న బెడితే, సొంత నియోజ‌క‌వ‌ర్గంలో తాను కూడా ఓడిపోవ‌డంతో నాడు ఆయ‌న‌ను దేవుడు అన్న‌వాళ్లే నేడు ఏదేదో అంటున్నారు. సినిమా ప‌రంగా వ‌రుస ఓట‌ములు చూసిన‌ప్ప‌టికీ కమల్ కు స‌రైన క‌థ త‌గిలితే అది బ్లాక్ బ‌స్ట‌ర్ అయి.. ప‌ది ఓట‌ముల‌ను మించిన గెలుపును అందిస్తుంది. క‌మ‌ల్ విష‌యంలో అది చాలా సార్లు రుజువు అయింది. కానీ, రాజ‌కీయాలు కాదు. ప్రజల మనసు గెలువాలి. ప్రత్యర్థుల దాడులు అధిగమించాలి. చివరకు ఓట్లు సంపాదించడంలో కూడా గెలవాలి. కానీ.. ఇక్కడ ఓడిపోవ‌డంతో క‌మ‌ల్ పై ఒక‌రి ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు ముగిసి, ఫ‌లితాలు వెలువ‌డి క‌మ‌ల్ పార్టీ ఓడిపోవ‌డంతోపాటు ఆయ‌న కూడా ఓట‌మి పాల‌య్యార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచీ మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. వాళ్లంతా పార్టీలో కీలక నేతలుగా ఉన్నవారే. పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్లు వదిలేసి వెళ్తున్నారు స్వార్థపరులు అనుకోవచ్చు. కానీ.. వెళ్లే వాళ్లంతా కమల్ పై ఒకేవిధమైన ఆరోపణలు చేస్తూ వెళ్లడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఏజీ మౌర్య మురుగనందన్ సీకే.కుమరావెల్ ఉమాదేవీ ఫలితాలు వచ్చిన వారంలోనే వెళ్లిపోయారు. కాస్త గ్యాప్ తో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ కూడా వెళ్లిపోయారు. ఆయన పోతూ పోతూ కమల్ పై నాలుగు రాళ్లు విసిరేసి పోయారు. కమల్ కు పార్టీని నడిపే విధానం తెలియదని పార్టీలో ప్రజాస్వామ్యం లేదని విమర్శలు గుప్పించి వెళ్లిపోయారు.

తాజాగా.. మరో కీలకనేతగా పనిచేసిన సీకే కుమరావేల్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వెళ్తూ.. ఈయన కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ స్థాపించిన తర్వాత కమల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పార్టీలోని ఇతర అభ్యర్థుల గెలుపు గురించి పట్టించుకోలేదని కేవలం తన ఎమ్మెల్యే స్థానంపైనే దృష్టిపెట్టారని అన్నారు. దీంతో.. కమల్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కీలక నేతలంతా విమర్శలు చేస్తూ వెళ్లిపోతుండడంతో.. అందులో వాస్తవం ఎంత అని చర్చించుకుంటున్నారు. నిజానికి వ్యక్తిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించినా నడుస్తుంది.. కానీ రాజకీయాల్లో అందరినీ కలుపుకొని వెళ్లాలి. పరిస్థితులను బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. పట్టూ విడుపులను అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కమల్ కు తెలియదని చెప్పలేం. కానీ.. అప్లై చేయడంలో ఖచ్చితంగా తేడా ఉందన్న విషయం అర్థమవుతోంది. వరుసగా నేతలు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనం.

క‌మ‌ల్ హాస‌న్ మాత్రం ఎంత మంది వెళ్లిపోతున్నా ఆత్మ విశ్వాసాన్ని ఎక్క‌డా కోల్పోవ‌డం లేదు. పోయేవాళ్లంతా కలుపు మొక్కలే.. ఎంత మంది పోయినా ఇబ్బంది లేదు అంటూ ధీమాగా చెబుతున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే, కమల్ రాజకీయంగా చాలా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితిని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రాబోయే ఐదేళ్లు పార్టీని కాపాడుకోవడం ఖచ్చితంగా సవాలే. మరి పార్టీని నడుపుతారా? లేక కఠిన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.