Idream media
Idream media
విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ఇప్పుడు సర్వత్రా మారుమోగుతోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎలాయినా మీసాలగీతకు సీటు ఇవ్వనప్పటి నుంచి ఆమె పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమెను పార్టీ దూరం పెట్టింది. విజయనగరం కార్పొరేషన్ కాదని బొబ్బిలి మున్సిపాల్టీ బాధ్యతలు అప్పగించడంపై ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తంచేశారు.
అశోక్ గజపతి వర్సెస్ మీసాల గీత?
విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు బొబ్బిలి మున్సిపాల్టీ బాధ్యతలు అప్పగించడంపై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తనను కావాలనే విజయనగరంలోని పార్టీ కేడర్కు దూరం చేయాలనే ఉద్దేశంతోనే మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు బొబ్బిలి మున్సిపాల్టీకి ఇన్ఛార్జిగా నియమించారని బహిరంగంగానే ఆరోపించారు. దీంతో విజయనగరంలో పార్టీ కేడర్గా కూడా రెండుగా చీలిపోయింది. అశోక గజపతిరాజుకు అనుకూలంగా కొంతమంది వ్యవహరిస్తుంటే, మీసాల గీతకు అనుకూలంగా మరికొందరు పార్టీ నాయకులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేషన్లో 50 డివిజన్లకు తొలిసారి జరగనున్నాయి. ఈ ఎన్నికల బాధ్యతలు అశోక్గజపతి కుమార్తె అధితికి అప్పగించడంపైనా ఆమె అలకబూనారు.
సైకిల్కు మరో షెడ్
2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు కాదని అశోక్ గజపతి తన కుమార్తె అధితికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ను ఇప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గీత ఆ ఎన్నికల్లో తన కేడర్తో సహా సహాయ నిరాకరణ చేపట్టింది. ఆ ఎన్నికల్లో అధితి ఘోర పరాజయం పాలవ్వగా వైసీపీ నేత కొలగొట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. విజయనగరంలో టీడీపీకి సంబంధించి పార్టీ సమావేశమైనా, మీడియా సమావేశమైనా అశోక్గజపతి నివాసంలోని చెట్లు కింద జరుగుతుంటాయి. దీన్ని బ్రేక్ చేస్తూ గీత సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకముందు గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా సొంత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం గమనార్హం.
ఇదీ రాజకీయ చరిత్ర
కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, వ్యాపారవేత్త గురానా సాధురామ్ కుమార్తె మీసాల గీత. గురనా అయ్యలు ఆమె సోదరుడు. గీత గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత తన తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. మొదట కాంగ్రెస్పార్టీ క్రీయాశీలక రాజకీయాల్లో పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ గురానా సాధురామ్కు పార్టీ టికెట్ను కేటాయించింది. అయితే అప్పటికే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తూ వస్తున్న కొలగొట్ల వీరభద్రస్వామికి అసంతృప్తికి గురై ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన గెలిచిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు.
పీఆర్పీలో గీత ప్రస్థానం
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున విజయనగరం చైర్మన్ గా ఉన్న మీసాల గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో గీతతో పాటుగా ఆమె సోదరుడు గురానా అయ్యలు కూడా టికెట్ను ఆశించారు. టికెట్ ఆయనకు దక్కకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యి రాజ్జకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గీత ఓటమి పాలై మూడోస్థానంతో సరిపెట్టుకుంది. పీఆర్పీ స్థాపించినప్పటి నుంచి చిరంజీవి గురాన సాధురాంను పలుమార్లు కలిసినా, పార్టీలోకి రావాలని చిరంజీవి కోరినా ఆయన మాత్రం కాంగ్రెస్ వీడలేదు. కానీ గీతకు మాత్రం పీఆర్పీలో ఎమ్మెల్యే సీటును మాత్రం ఇప్పించడంలో సఫలికృతులయ్యారు.
టీడీపీపై తిరుగుబావుటా?
పీఆర్పీలో ఓటమి తర్వాత మీసాల గీత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరింది.2014లో తెలుగుదేశం పార్టీలోకి చేరిన గీత మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అశోక్గజపతిరాజు ఎంపీగా, గీత ఎమ్మెల్యే ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అశోక్గజపతిరాజు గీతను కాదని తన కుమార్తె అధితికి సీటును ఇప్పించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఆ ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో అధితి ఘోర పరాభవాన్ని చవిచూడగా కొలగొట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు.
2019 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలు గెలిచి వైసీపీ చరిత్ర సృష్టించింది. ఎంపీ,ఎమ్మెల్యే లుగా పోటీచేసిన అశోక్ గజపతి రాజు,అదితి గజపతిరాజు ఓటమి తో రాజుగారి కుటుంబంలో నైరాశ్యం నెలకొనివుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీసాల గీత తిరుగుబాటు జండా ఎగరవేయటం విజయనగరం ఎన్నికల్లో టీడీపీకి భారీ నష్టం.