iDreamPost
iDreamPost
మనం ఎన్నిచేసినా సక్సెస్ కాలేకపోతుంటే.. ఆల్రెడీ సక్సెస్ అయిన వారి దారిలో ప్రయాణించడమే బెస్ట్. ఇది ఒక రకంగా కాపీ కొట్టడమే అయినప్పటికీ సక్సెస్ కోసం ఈ మాత్రం ప్రయత్నం తప్పదనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ తరహాలో విజయం సాధించిన వారి దారినే అనుసరించడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణాలో సక్సెస్ సాధించేసిన టీఆర్ఎస్, ఆ పార్టీ నాయకులు అనుసరించే దారినే ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు ఫాలో అవుతున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారుగా బరిలో నిలుస్తున్న బీజేపీ నాయకులు టీఆర్ఎస్ సక్సెస్ఫార్ములాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్న సంకేతాలిస్తున్నారు.
ఎదుటి వారిని విమర్శించేటప్పుడు కొంచెం చతురత మిళితం చేస్తే ప్రజలను సులభంగానే ఆకట్టుకోగలుగుతారు నాయకులు. ఈ విద్యలో కేసీఆర్, ఆయన బృందం ఆరితేరిపోయారు. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా ఎదుటి వారిమీద కామెడీ పంచ్లు మాంచి ఈజ్తో వేయడంలో వారికివారే సాటి అంటుంటారు. ఇప్పుడు ఇదే దారిని బీజేపీ నాయకులు కూడా ఎంచుకున్నట్లుగా కన్పిస్తున్నారు. కేసీఆర్ను, ఆయన బృందాన్ని పలుచన వేసే విధంగా వాగ్భాణాలు సంధిస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామన్న ధీమాను కల్పించేందుకు తీవ్రంగానే పాటుపడుతున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో పట్టు ఉంటుందన్న అంచనాలు గతంలో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి అక్కడెక్కడా కన్పిస్తున్న దాఖలాల్లేవంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నంగా ప్రజలు బీజేపీని భావిస్తున్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోయేందుకు ప్రజలకు గుర్తిండిపోయే రీతిలో ప్రసంగాలను రూపొందించుకునే ప్రయత్నంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోందుంటున్నారు.
కేవలం 13 రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికలు ముగించేసే విధంగా టీఆర్ఎస్ రాజకీయ చతురతను చాటుకుంది. తద్వారా ప్రత్యర్ధి పార్టీలకు అసలు అభ్యర్ధుల జాబితాలనే సిద్ధం చేయలేనంతటి పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉన్న తక్కువ టైమ్లోనే ప్రజల్లోకి మరింతగా దూసుకువెళ్ళేందుకు తగిన మార్గాలను ఆయా పార్టీలు వెతుక్కుంటున్నాయి. ఇదే ప్రయత్నంలో రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరమైన, గుర్తు పెట్టుకోదగ్గ రీతిలోనే ఎన్నికల ప్రసంగాలు ఉండబోతున్నాయన్నమాట.
ఇప్పటికే ఈ దారిలో ముదిరిపోయిన కేసీఆర్ మాట వింటారో? కొత్తగా ఈ బాట పట్టిన పార్టీల మాట గ్రేటర్ ప్రజలు వింటారో? ఎన్నికల ఫలితాల ద్వారానే తేలాల్సి ఉంటుంది.